తెలుగు రాష్ట్రాల అప్పులు తీరుస్తా-తెలంగాణకు సీఎం అవుతా-కేఏ పాల్ షాకులే షాకులు
ఏపీ, తెలంగాణలో మళ్లీ హల్ చల్ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. నిత్యం సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన ఒకదానితో ఒకటి పొంతన లేని వ్యాఖ్యలతో కలకలం రేపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల గురించి పాల్ ఇవాళ కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ, తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే సీఎంలు జగన్, కేసీఆర్ తనతో చేతులు కలపాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఈ రాష్ట్రాలు శ్రీలంకలా మారకుండా ఉండాలంటే, అప్పులు తీరాలంటే ప్రజాశాంతి పార్టీని ఆదరించాలని పిలుపునిచ్చారు. ఏపీలో చేస్తున్న యాత్రలో భాగంగా నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్.. తెలంగాణలో రాబోయేది ప్రజాశాంతి పార్టీ ప్రభుత్వమని చెప్పారు. తాను తెలంగాణలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ముఖ్యమంత్రి అవుతానని వెల్లడించారు.
ఏపీలో టీడీపీ, వైసీపీలు లక్షల కోట్లు ఖర్చుపెట్టి రాజధాని నిర్మించలేకపోయాయని కేఏ పాల్ మండిపడ్డారు. చంద్రబాబు, జగన్ బీజేపీకి సరెండర్ అయిపోయారని ఈయన విమర్శించారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని, దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని పాల్ చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి తాను అంటే చాలా గౌరవం అని పాల్ చెప్పుకొచ్చారు. వంద సార్లు ప్రజాశాంతి పార్టీలోకి రమ్మని పవన్ కళ్యాణ్ కు ఆఫర్ ఇచ్చానని కేఏ పాల్ గుర్తుచేశారు.
అయితే కేఏ పాల్ వ్యాఖ్యలపై ఏపీ, తెలంగాణలో రాజకీయ పార్టీలు కానీ, వాటి నేతలు కానీ ఎక్కడా స్పందిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అయినా పాల్ మాత్రం యథాలాపంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తద్వారా కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి తెలంగాణలో వచ్చే ఏడాది, ఏపీలో రెండేళ్ల తర్వాత ఎన్నికలు ఉన్నాయి. అయినా ఇప్పటి నుంచే యాత్ర పేరుతో పాల్ చేస్తున్న హడావిడిని చూసి జనం నవ్వుకుంటున్నారు.