మోడీకి ఓటేయండి, తొలిసారి అడుగుతున్నా: కెఏ పాల్
స్కాములతో నాయకులు ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి, పిల్ల కాంగ్రెసులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. తాను టిడిపి తరఫున ప్రచారానికి సిద్ధమన్నారు. తల్లి, పిల్ల కాంగ్రెస్లవల్ల అవినీతి దేశ సరిహద్దులు దాటి విస్తరించిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని, రాష్ట్రాన్ని సక్రమ మార్గంలో నడిపేందుకు ఎన్డీయే, చంద్రబాబుల సమర్థ పాలన అవసరమన్నారు.
తాను ఇప్పటి వరకు ఏ రాజకీయపార్టీ కార్యాలయంలోకి వెళ్లలేదని, తొలిసారి టిడిపి కార్యాలయంలోకి వచ్చి సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరుతున్నట్లు చెప్పారు. మైనారిటీలందరూ మోడీకి, టిడిపికి మద్దతు పలకాలన్నారు. మైనారిటీ సోదరులు తాము ఓటేయడంతోపాటూ ఇతరులకూ చెప్పి ఎన్డీయే, టిడిపికి ఓటేయించేలా చొరవ తీసుకోవాలన్నారు. ఈ నెల 5న చంద్రబాబు తనను కలిసి మద్దతు కోరారని, మూడు నెలల క్రితం కెసిఆర్ సైతం తనను కలిశారని చెప్పారు.
అందరూ తనను కలిసి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు. అయితే, బాబు పరిపాలనదక్షతను వ్యతిరేకులు సైతం అంగీకరిస్తారన్నారు. తానెప్పుడూ టిడిపికి ఓటేయాలని చెప్పలేదని, ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం సైకిల్ గుర్తును ఎంచుకోవాలన్నారు. రాజకీయాలు.. మతం వేరు కాదని, దేశంలో పార్టీలన్నీ లౌకికవాద పార్టీలే అన్నారు.