హర్యానాలో పట్టుబడిన ఎర్రచందనం స్మగ్లర్
కడప: ఎర్రచందనం స్మగ్లర్ల కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసుల వేట కొనసాగుతోంది. ఈ వేటలో భాగంగా అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ముఖేష్ బలానీని అరెస్టు చేశారు. హర్యానాలోని హిస్సార్ జిల్లాలో తలదాచుకున్న ముఖేష్ను స్థానిక పోలీసుల సహకారంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి దాదాపు రూ.20 కోట్లు విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కొన్నేళ్లుగా ముఖేష్ బలానీ చైనా, మలేషియా రాష్ర్టాలలో ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు కుదుర్చుకుని ఎర్రచందనాన్ని అక్రమంగా విదేశాలకు తరలించినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ స్మగ్లర్ ముఖేష్ బలానీ శేషాచలం అడవుల నుంచి పెద్దమొత్తంలో ఎర్రచందాన్ని అక్రమంగా తరలించాడు.
స్థానిక ఎర్రచందనం స్మగ్లర్ల వద్ద ఎర్రచందనం దుంగలను కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలు, దేశాలకు తరలించినట్లు సమాచారం. కొంతకాలంగా ముఖేష్ బలానీపై నిఘా పెట్టిన ఏపీ పోలీసులు పక్కా సమాచారంతో హిస్సార్ పోలీసుల సహకారంతో దాడులు చేసి ముఖేష్ బలానీని అరెస్ట్ చేశారు. ముఖేష్ను పోలీసులు ఏపీకి తీసుకువచ్చి విచారణ చేపట్టనున్నారు.
ముఖేష్ బలానీపై రాయలసీమలోని రైల్వే కోడూరు, బద్వేలుల్లో కేసులు ఉన్నాయి. హర్యానాలోని హిస్సార్ జిల్లాలో మరిన్ని ఎర్రచందనం దుంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు.