కడప స్టీల్ ప్లాంట్కూ తప్పని చిక్కులు- తీవ్ర అప్పుల్లో భాగస్వామి-ప్రత్యామ్నాయాలేంటి ?
ఏపీలో ఓవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాక రేపుతున్న నేపథ్యంలో కడప స్టీల్ ప్లాంట్పై జనం ఆశలు పెట్టుకున్నారు. తాజాగా కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు కూడా రావడంతో ఈ ప్లాంట్ నిర్మాణం శరవేగంగా సాగిపోతుందని అంతా భావించారు. ఇలాంటి తరుణంలో బ్రిటన్కు చెందిన కడప స్టీల్ ప్లాంట్ పెట్టుబడిదారు, భాగస్వామి లిబర్టీ గ్రూప్ ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో ఆ ప్రభావం మన ప్లాంట్పైనా పడబోతోంది. లిబర్టీ గ్రూప్ మాతృసంస్ధ గుప్తా ఫ్యామిలీ అలయన్స్ అయితే ఏకంగా బ్రిటన్ కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేయడంతో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.
Recommended Video
కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం
వైఎస్సార్ స్టీల్ కార్పోరేషన్పై ఏఫీ ప్రభుత్వం పేరు పెట్టిన కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం బ్రిటన్కు చెందిన లిబర్టీ గ్రూప్ను భాగస్వామిగా ఎంచుకున్నారు. కేంద్రం నుంచి సాయం అందే పరిస్ధితులు లేకపోవడం, ఈ భారీ ప్లాంట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టే పరిస్ధితి లేకపోవడంతో విదేశీ సంస్ధ సాయం తీసుకుందామని ప్రభుత్వం భావించింది. స్టీల్ ప్లాంట్ల నిర్మాణంలో అనుభవం కలిగిన లిబర్టీ గ్రూప్ తొలిదశలో రూ.10 వేల కోట్లను కడప స్టీల్ ప్లాంట్లో పెట్టుబడిగా పెట్టాల్సి ఉంది. దీనికి ఏపీ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ను విడుదల చేయడంతో పాటు భూమి, ఇతర అవసరాలను చూసుకుంటుంది. త్వరలో పనులు కూడా ప్రారంభం కావాల్సి ఉంది.
ఆర్ధిక ఇబ్బందుల్లో భాగస్వామి లిబర్టీ గ్రూప్
కడప స్టీల్ ప్లాంట్లో పెట్టుబడులకు సిద్ధమైన లిబర్టీ గ్రూప్ ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా చేసుకుంది. అయితే తాజాగా లిబర్టీ గ్రూప్ మాతృసంస్ధ గుప్తా ఫ్యామిలీ అలయన్స్ ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది. దీనికి ప్రధాన రుణదాత అయిన గ్రీన్సిల్ క్యాపిటల్ తాజాగా బ్రిటన్ కోర్టులో దివాళా పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఇందులో తాను అప్పులిచ్చిన గుప్తా ఫ్యామిలీ అలయన్స్ తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉందని గ్రీన్సిల్ తన పిటిషన్లో పేర్కొన్నట్లు రాయిటర్స్ తెలిపింది. దీని ప్రభావం లిబర్టీ గ్రూప్పైనా పడినట్లు తెలుస్తోంది. గుప్తా ఫ్యామిలీ అలయన్స్ ప్రస్తుతం రూ.30 వేల కోట్ల మేర అప్పుల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది.
పర్యావరణ అనుమతులిచ్చిన కేంద్రం
కేంద్రం తాజాగా కడప స్టీల్ ప్లాంట్ కోసం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. సీఎం జగన్ సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్ కావడంతో ఆయన కేంద్రంలో పెద్దలతో భేటీలో పదేపదే ఈ విషయాన్ని ప్రస్తావించి మరీ పర్యావరణ అనుమతులు సాధించుకున్నారు. ఓవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఏపీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కడప స్టీల్ ప్లాంట్కు పర్యావరణ అనుమతులు ఇవ్వడం ద్వారా కాస్త ఊరటనివ్వాలని కేంద్రం భావించడమే ఇందుకు కారణం. అయితే పర్యావరణ అనుమతులు సాధించుకున్నా ఇప్పుడు భాగస్వామి ఆర్ధిక సమస్యలతో ప్లాంట్ నిర్మాణం ముందుకు సాగని పరిస్ధితి.
కడప స్టీల్పై జగన్ సర్కార్ కిం కర్తవ్యం ?
కడప స్టీల్ ప్లాంట్ భాగస్వామి అయిన లిబర్టీ గ్రూప్ ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో ఆ ప్రభావం తప్పనిసరిగా ఈ ప్లాంట్ నిర్మాణంలో పడబోతోంది. ఇప్పటికే భారత్లో లిబర్టీ గ్రూప్ నిర్మించతలపెట్టిన మరో రెండు ప్లాంట్లు కూడా తాజా పరిణామాలతో ఆలస్యం కావొచ్చన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ప్రభుత్వం.. బ్రిటన్లో బారత రాయబార కార్యాలయంతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. లిబర్టీ గ్రూప్తో భాగస్వామ్యం విఫలమైతే ప్రభుత్వం మరో కొత్త భాగస్వామిని అన్వేషించే అవకాశాలున్నాయి.