అమ్మను, చెల్లెనే నమ్మలేదు: జగన్పై కడియం శ్రీహరి
జగన్ చేసిన వ్యాఖ్యలు తనకు ఆశ్చర్యం కలిగించాయని ఆయన అన్నారు. పాలనాయంత్రాంగాలను, రాజ్యాంగ వ్యవస్థలను, రాష్ట్ర రాజకీయాలను వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్ జగన్ భ్రష్టుపట్టించారని ఆయన అన్నారు. రాజకీయాలు చెడిపోయాయనని అనడానికి జగన్ సిగ్గుపడకపోవచ్చు గానీ జగన్ నోట ఆ మాట వినడానికి తాము సిగ్గుపడుతున్నామని కడియం శ్రీహరి అన్నారు.
నీతి, నియాజతీ గురించి మాట్లాడే అర్హత కూడా జగన్కు లేదని ఆయన అన్నారు. జగన్ నీతినిజాయితీల గురించి మాట్లాడితే వినే దుర్గతి రాష్ట్ర ప్రజలకు పట్టలేదని ఆయన అన్నారు. అసలు నీతినిజాయితీ అంటే ఏమిటో జగన్కు తెలుసా అని అడిగారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు జగన్ దోచుకున్నారని ఆయన ఆరోపించారు. సీమాంధ్ర పార్టీలతో లాలూచీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణలోని పది జిల్లాల్లో వచ్చే నెల 13 నుంచి మండల స్థాయిలో తమ పార్టీ శిక్షణాతరగతులు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇరవై రోజుల పాటు సాగే ఈ తరగతుల్లో తెలంగాణ పునర్నిర్మాణంపై చర్చిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర గురించి కూడా చర్చిస్తామని ఆయన చెప్పారు.
గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టును ఆపడమే తన ఎజెండా అని తెరాస నేత ఈటెల రాజేందర్ అన్నారు. ఖమ్మం జిల్లాలోని వరద తాకిడి ప్రాంతాల్లో ఆయన సోమవారం పర్యటించారు. తెలంగాణ ప్రాంతానికి కేటాయించిన నీళ్లు వాడుకున్న తర్వాతనే ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ఆయన అన్నారు. భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమని ఆయన అన్నారు. జగన్తో తమ పార్టీ కుమ్మక్కయిందనే వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు. కాంగ్రెసులో తమ పార్టీ విలీనం కాదని ఆయన స్పష్టం చేశారు.