కడియం వర్సెస్ మోత్కుపల్లి: 'దండోరా', కెసిఆర్ మౌనం
హైదరాబాద్: తెలంగాణ డిప్యూటి ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మాదిగ దండోరా నాయకుడు మందకృష్ణ మాదిగ - కడియం శ్రీహరి పట్ల కాస్తా మెతక వైఖరి అవలంబిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై విరుచుకుపడుతున్నారు. కెసిఆర్కు వ్యతిరేకంగా దండయాత్ర చేపడుతానని ఆయన మాటిమాటికీ హెచ్చరిస్తున్నారు.
అయితే, కెసిఆర్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు. మంత్రులు గానీ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు గానీ ఆ వ్యవహారంపై మాట్లాడడం లేదు. ఉప ముఖ్యమంత్రిగా టి.రాజయ్యను తప్పించడంపై కూడా తెరాస నాయకులు నోరు విప్పడం లేదు. కచ్చితమైన ఆదేశాలు కెసిఆర్ నుంచి అందడం వల్లనే వారు మాట్లాడడం లేదని అంటున్నారు.
ఉప ముఖ్యమంత్రి పదవి కడియంకు ఇవ్వడంపై మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు స్పందించిన కడియం శ్రీహరి - రాజకీయ విమర్శలు సిద్ధాంతపరంగా ఉండాలి తప్ప వ్యక్తిగత ప్రతిష్టను కించపరిచే విధంగా ఉండకూడదని అన్నారు. మోత్కుపల్లి చేసిన విమర్శలకు ఆధారాలు ఏమైనా ఉంటే వరంగల్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి విచారణ జరిపించాలని ఆయన సవాల్ చేశారు.
కడియం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్కు అన్నీ తెలుసునని, కడియం ఏనుగు అనుకుని పదవి ఇచ్చారని చెప్పుకుంటున్నారని, ఇప్పుడు అసలు రంగు తెలిసిన తర్వాత కేసీఆర్కు అర్థమవుతుందని అన్నారు. 20 ఏళ్ల నుంచి కడియం మాదిగ అని చెప్పుకున్నారని... ఇప్పుడు బైండ్ల కులమని ఆయన చెబుతున్నారని మోత్కుపల్లి విమర్శించారు. కోర్టుకు వెళితే అన్ని విషయాలు బయటకు వస్తాయని... నిజ నిర్థారణ జరిగిన తర్వాతే కడియం శ్రీహరి అధికార బాధ్యతలు చేపట్టాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు.
మోత్కుపల్లి నర్సింహులు మాదిగ కార్డు కూడా వాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకే డిప్యూటీ సి.ఎం. పదవి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి దళితుడు కాదని ఆయన పునరుద్ఘాటించారు. రాజయ్యను అవమానించిన కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు. రాజ్యాంగం దళితులకు ఇచ్చిన హక్కులను హరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించడాన్ని మందకృష్ణ మాదిగ తప్పు పడుతున్నారు. మాదిగలపై కేసీఆర్కు ఉన్న వివక్ష, పగ, ద్వేషానికి రాజయ్య ఉదంతం పరాకాష్ఠ అని అన్నారు. రాజయ్య నిజంగా అవినీతి పరుడైతే వివరణ ఇచ్చేందుకు ఆయనకు అవకాశమివ్వాలని అన్నారు. బంతిని నేలకు కొడితే ఎలా లేస్తుందో మాదిగలను ఎంతగా అణగ దొక్కాలని చూస్తే అంతగా పైకి లేస్తామని మంద కృష్ణ వ్యాఖ్యానించారు.