కీచక కరస్పాండెంట్: 9వ తరగతి విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారం, గర్భస్రావం
తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. తల్లిదండ్రులతో తర్వాత ఆ బాధ్యతను పోషించాల్సిన గురువు స్థానంలో ఉన్న ఓ వ్యక్తి.. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది.ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కాకినాడ నగరానికి చెందిన బాధిత బాలిక ఆరో తరగతి నుంచి కొండయ్యపాలెంలోని హెల్పింగ్ హ్యాండ్స్ అనే ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ చదువుకుంటోంది. తండ్రి చనిపోవడంతో ఆమె తల్లి అంతా తానై చూసుకుంటోంది.
కాగా, ఇటీవలే తొమ్మిదో తరగతి పరీక్షలు రాసిన బాలికపై వసతి గృహం కరస్పాండెంట్ కొత్తపల్లి విజయ్ కుమార్(60)ఆమెపై కన్నెశాడు. ఈ క్రమంలో ఆమెకు మాయమాటలు చెప్పి గత ఏప్రిల్ నెలలో తనగదికి తీసుకెళ్లి.. కరోనా మాత్రలంటూ కొన్ని మాత్రలు ఇచ్చాడు విజయ్ కుమార్. అవి వేసుకున్న బాలిక మత్తులోకి జారుకుని నిద్రపోయింది.
ఆ తర్వాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు విజయ్ కుమార్. ఇలా పలుమార్లు ఆమెను తీసుకెళ్లి అఘాయిత్యాన్ని కొనసాగించాడు. కాగా, వేసవి సెలవుల నేపథ్యంలో ఇంటి వద్ద ఉంటున్న బాలిక మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. అంతేగాక, తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో ఆందోళన చెందిన బాలిక తల్లి.. ఏం జరిగిందని ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది.
ప్రస్తుతం బాధిత బాలిక కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతోంది. ఆమెకు గర్భస్రావం అయినట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు విజయ్ కుమార్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న విజయ్ కుమార్ కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.