హైటెన్షన్ కాకినాడకు షిఫ్ట్: నంద్యాల ఎఫెక్ట్ ఉంటుందా?, నేడే పోలింగ్..
హైటెన్షన్ నంద్యాల నుంచి కాకినాడకు షిఫ్ట్ అయింది. నంద్యాల ఉపఎన్నికల ఫలితాలు తేలిపోవడంతో.. ఇక నేడు జరగబోయే కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలపై అందరి దృష్టి నిలిచింది.
కాకినాడ: హైటెన్షన్ నంద్యాల నుంచి కాకినాడకు షిఫ్ట్ అయింది. నంద్యాల ఉపఎన్నికల ఫలితాలు తేలిపోవడంతో.. ఇక నేడు జరగబోయే కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలపై అందరి దృష్టి నిలిచింది. కాకినాడ ఓటరు కూడా నంద్యాల తరహా మనోగతాన్నే వెలిబుచ్చుతాడా? లేక వైసీపీకి పట్టం కడుతాడా? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కాగా, మంగళవారం ఉదయం 7 గం. కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. పోలింగ్ ఫలితాలు సెప్టెంబరు 1న వెల్లడికానున్నాయి. మొత్తం 48డివిజన్లలో టీడీపీ 39, మిత్రపక్షం బీజేపీ 9 డివిజన్లలో పోటీ చేస్తున్నాయి. వైసీపీ అన్ని స్థానాల్లోను అభ్యర్థులను నిలిపింది. ఇక కాంగ్రెస్ 17 డివిజన్లలో బరిలో దిగగా.. స్వతంత్ర అభ్యర్థులు 6డివిజన్లలో పోటికి దిగారు.
అక్కడ ఎన్నికలు లేవు:
కాకినాడ కార్పోరేషన్ లో నిజానికి 50డివిజన్లు ఉండగా.. కాకినాడ రూరల్ మండలంలోని గంగానపల్లి, ఎస్.అచ్యుతాపురం, స్వామినగర్ ప్రాంతాల్లోని రెండు డివిజన్లలో ఎన్నికను హైకోర్టు తాత్కాలికంగా నిలిపేసింది. 48డివిజన్లలో మాత్రమే ఎన్నిక జరగబోతోంది.
Recommended Video
వైసీపీకి ఊరట కలుగుతుందా?
కాకినాడలో మొత్తం 196పోలింగ్ కేంద్రాల్లో నేటి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ, వైసీపీ పార్టీల అధినేతలు కూడా ఇక్కడ ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. నంద్యాల ఫలితంతో ఢీలా పడ్డ వైసీపీకి కాకినాడతో ఊరట కలుగుతుందా? లేక ఇక్కడ కూడా అదే ఫలితం రిపీటవుతుందా? అన్నది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.
నంద్యాల ఎఫెక్ట్?:
నంద్యాల ఉపఎన్నికలో అధికార పార్టీ సత్తా చాటినందునా.. దీని ఎఫెక్ట్ కాకినాడ ఉపఎన్నికపై ఉంటుందా? అన్నది కూడా ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం. జనం అధికార పార్టీతోనే అభివృద్ది సాధ్యమని విశ్వసిస్తే.. మళ్లీ నంద్యాల ఫలితమే రిపీటైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే వైసీపీ మరిన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఒకవేళ ఫలితం వైసీపికి అనుకూలంగా ఉంటే మాత్రం అన్ని చోట్ల ప్రజలు ఒకే అభిప్రాయంతో లేరన్న విషయం స్పష్టమవుతుంది.
కాకినాడ ఫలితం ఏం తేలుతుంది:
కాకినాడ ఫలితాల్లోను అధికార పార్టీ వైపే ఓటరు నిలబడితే.. ఆ పార్టీలో ధీమా మరింత బలపడుతుంది. ఇదే ధీమాతో 2019ఎన్నికలకు సిద్దమవుతుంది. ఒకరకంగా జనం స్థిరాభిప్రాయంతో ఉన్నారన్న భావనకు టీడీపీకి వస్తుంది. అదే సమయంలో వైసీపీలో తీవ్ర ఆందోళన పెరగడం ఖాయం.
ఎన్నికల వ్యూహకర్త అంటూ ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దించినప్పటికీ.. వైసీపీ సత్తా చాటలేకపోతుండటం ఆ పార్టీని కలవరపరిచే అంశం. నంద్యాల ఫలితంతో ఢీలా పడ్డ పార్టీకి కాకినాడలో విజయం తప్పనిసరే అని చెప్పాలి. ఇక్కడ కూడా ఫలితం తారుమారైతే.. ఆ పార్టీ స్వీయ సమీక్ష చేసుకోవడం అనివార్యమని చెప్పాలి.