కాకినాడ మున్సిపోల్స్: ఊపందుకున్న ప్రచారం, రోజా వ్యాఖ్యలకు.. ఎమ్మెల్యే అనిత కౌంటర్
తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సినీ ఫక్కీలో ప్రసంగాలు, పంచ్ డైలాగులతో కాకినాడ ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు నానా పాట్లు పడుతున్నారు.
కాకినాడ/విశాఖపట్టణం: తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సినీ ఫక్కీలో ప్రసంగాలు, పంచ్ డైలాగులతో కాకినాడ ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు నానా పాట్లు పడుతున్నారు.
తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా తన ఎన్నికల ప్రసంగంలో పోకిరి సినిమా డైలాగును ప్రయోగించారు. కాకినాడ ప్రజలు తమ ఓటుతో అధికార తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలంటూ "ఎవరు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో.. వారే కాకినాడ ఓటర్లని నిరూపించాలి.." అని ఈ వైసీపీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
రోజా తన ఆవేశపూరిత ప్రసంగంతో టీడీపీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాకినాడను స్మార్ట్ సిటీ చేస్తామని స్మార్ట్గా మోసం చేశారని విమర్శించారు. బెల్ట్ తీస్తామన్న అధికార పార్టీ ఇప్పుడు వీధికో మద్యం షాపు పెట్టిందని దుయ్యబట్టారు. మంత్రివర్గంలో ఒక్క మైనారిటీకి కూడా స్థానం కల్పించలేదని ఆరోపించారు.
''రోజా వచ్చాక.. టీడీపీ గెలుపు పక్కా..''
వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే అనిత కౌంటర్ ఇచ్చారు. కాకినాడలో టీడీపీ కోట్లు వెదజల్లినట్లు రోజా చెబుతున్నది నిజమేనన్నారు అనిత. కాకినాడ నగర అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన మాట వాస్తవమేనని అనిత అన్నారు.
అయితే టీడీపీకి ఓట్లు కొనుక్కోవాల్సిన దుస్థితి మాత్రం లేదంటూ.. రోజా వచ్చిన తర్వాత టీడీపీ గెలుపు మరింత పక్కాఅయిందని ఆమె పేర్కొన్నారు. మొత్తంమీద కాకినాడ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార, విపక్ష వర్గాల ప్రచారం ఆరోపణలు, ప్రత్యారోపణలతో మరింత వేడెక్కింది.
ఓట్లర్లను ఆకట్టుకునేందుకు నువ్వా, నేనా అన్నట్టు ఆవేశపూరితంగా ప్రసంగాలు సాగుతున్నాయి. ప్రత్యేకించి అధికార, విపక్ష ఎమ్మెల్యేలైన రోజా, అనితల మధ్య పలు అంశాలపై మొదటి నుంచీ కొనసాగుతూ వస్తున్న మాటల యుద్ధం ఆసక్తికరంగా సాగుతూనే ఉంది.