గోతి కాడి నక్కలా జగన్, పవన్కు వివరిస్తాం: కాల్వ
విజయవాడ: ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు కాల్వ శ్రీనివాసులు తీవ్రంగా మండిపడ్డారు. రాజధానికి భూసేకరణను జగన్ తప్పు పట్టడాన్ని ఆయన వ్యతిరేకించారు. జగన్ గోతి కాడి నక్కలా కాచుకుని ఉన్నాడని ఆయన వ్యాఖ్యానించారు. టిడిపి ఉన్నత స్థాయి సమావేశానంతరం ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబుపై నమ్మకంతో రాజధాని నిర్మాణం కోసం పంటలు పండే 33 వేల ఎకరాల భూములను రైతులు ఇచ్చారని, జాతీయ స్థాయిలో ఈ విషయంపై ప్రశంసలు వస్తున్నాయని, ఈ స్థితిలో ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన అన్నారు. రైతులు ఆ విధంగా ముందుకు రావడం దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని ఆయన అన్నారు. దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు.
ప్రతిదాన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనే కుటిల నీతిని వైయస్సార్ కాంగ్రెసు అనుసరిస్తోందని, రాష్ట్రం దగాపడడానికి, అన్ని అనర్థాలకు కారణమైన కాంగ్రెసు పార్టీ కూడా ప్రత్యేక హోదాపై మాట్లాడుతోందని ఆయన అన్నారు. ఆ పార్టీల నాయకులు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా మాట్లాడుతున్నాయని, అవినీతిపరులు నీతి గురించి మాట్లాడుతున్నారని ఆయన ఎత్తిపొడిచారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో భాగంగా చేపట్టిన భూసేకరణ వల్ల తలెత్తిన పరిస్థితులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు వివరిస్తామని కాల్వ అన్నారు. పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడినా మాట్లాడకపోయినా తాము ఈ విషయాలు తెలియజేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.
పవన్ కళ్యాణ్ను కలిసి పరిస్థితులను వివరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమతో చెప్పినట్లు ఆయన తెలిపారు. భూసేకరణపై పవన్ కళ్యాణ్కు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు.
ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశం ఇక జాతీయ పార్టీ అవుతుందని, ఈ విషయంపై చంద్రబాబు పార్టీ నాయకుల సలహాలు తీసుకున్నారని ఆయన చెప్పారు. ఐదారు రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు తమ పార్టీకి ఉన్నాయని ఆయన చెప్పారు. బిజెపి, కాంగ్రెసు మినహాయిస్తే జాతీయ పార్టీలుగా చెప్పుకునే చాలా పార్టీలు మూడు లేదా ఐదు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమయ్యాయని ఆయన అన్నారు.
భారతదేశంలో ఏ పార్టీ చేయని విధంగా, ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆయన అన్నారు. రైతులకు 25 వేల కోట్ల మేరకు ఏ రాష్ట్రంలో జరగని విధంగా రుణమాఫీ చేశామని ఆయన చెప్పారు. ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా భారతదేశంలోనే వినూత్నమైన రీతిలో చేపడుతున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications