బద్వేల్ ఉపఎన్నిక: కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలవనున్న కమలమ్మ, ఇక మిగిలింది బీజేపీనే
అమరావతి: బద్వేల్ ఉపఎన్నికకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించింది. ఆ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పోటీ చేస్తారని కాంగ్రెస్ మంగళవారం ప్రకటించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేల్కు ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.
బద్వేల్ ఉపఎన్నిక అక్టోబర్ 30న జరగనుంది. కాగా, మృతి చెందిన ఎమ్మెల్యే భార్యకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఈ క్రమంలో గత సంప్రదాయాల ప్రకారం పోటీ చేయట్లేదని ఇప్పటికే జనసేన తోపాటు తెలుగుదేశం పార్టీలు ప్రకటించాయి. అయితే, భారతీయ జనతా పార్టీతోపాటు మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ బరిలో దిగుతున్నాయి.
ఈ క్రమంలో బద్వేల్ ఉపఎన్నిక త్రిముఖ పోటీగా మారింది. బద్వేల్ ఉపఎన్నికలో పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించినప్పటికీ.. అభ్యర్థి పేరును మాత్రం ఆ పార్టీ ఖరారు చేయలేదు. తమ పార్టీ నుంచి అభ్యర్థి ఉపఎన్నికలో పోటీ చేస్తారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పటికే ప్రకటించారు. అంతేగాక, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను ప్రచారానికి పిలుస్తామని చెప్పారు. అయితే, తమ పార్టీ నుంచి అభ్యర్థినే నిలపని పవన్ కళ్యాణ్.. ప్రచారం నిర్వహించేందుకు వస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.
కాగా, బద్వేల్ ఉపఎన్నిక గెలుపుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్ సుధ పూర్తి ధీమాగా ఉన్నారు. ఇటీవల ఆమె బద్వేల్ ఉపఎన్నికపై మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే బద్వేల్ ఉప ఎన్నికలో తనను గెలిపిస్తాయని ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేస్తామన్నారు.
ఇప్పటికే బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం 4 వందల కోట్లు కేటాయించారని తెలిపారు సుధ. బద్వేల్ మున్సిపాలిటీకి 120 కోట్లు కేటాయించారన్నారు. 2019 ముందు బద్వేల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. ఈ రెండేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కంటే ఈ ఎన్నికల్లో మంచి మెజారిటీ సంపాధిస్తామన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చి 28 న మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో దివంగత డాక్టర్ వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధను పార్టీ అధిష్టానం బద్వేలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది.
మరోవైపు, బద్వేల్ ఉప ఎన్నికపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత గురువారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. దివంగత వెంకటసుబ్బయ్యగారి భార్య దాసరి సుధ కూడా డాక్టరేనని, తమ పార్టీ తరఫు నుంచి ఆమెను అభ్యర్థిగా నిలబెడుతున్నామన్నారు. బద్వేల్ నియోజకవర్గ బాధ్యతలన్నీ సమావేశానికి వచ్చిన వారందరి మీద ఉన్నాయన్నారు. నామినేషన్ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలన్నారు. 2019లో దాదాపు 44వేలకుపైగా ఓట్ల మెజార్టీ వచ్చిందని సీఎం జగన్ గుర్తు చేశారు. గతంలో వెంకసుబ్బయ్యకు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ డాక్టర్ సుధకి రావాలని తెలిపారు. ఎక్కడా అతి విశ్వాసం ఉండకూడదని, కష్టపడి ప్రజల ఆమోదాన్ని పొందాలని స్పష్టం చేశారు. 2019లో 77శాతం ఓటింగ్ జరిగిందని, ఓటింగ్ శాతం పెరగాలని సూచించారు. అందరూ ఓట్లు వేసేలా ఓటర్లను ప్రోత్సహించాలని సీఎం జగన్ తెలిపారు. ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి మండలం కూడా బాధ్యులకు అప్పగించాలని, గ్రామస్థాయి నాయకులతో కలిపి ప్రచారం నిర్వహించాలని తెలిపారు.