బాబు అలా అన్నారా, పవన్ చూసుకుంటారు: కామినేని, 'సుజనా! పెళ్లి తప్ప అన్నీనా'
విజయవాడ: బీజేపీతో స్నేహపూర్వకంగా విడిపోదామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్న విషయం తనకు తెలియదని మంత్రి, కమలం పార్టీ నేత కామినేని శ్రీనివాస్ రావు గురువారం అన్నారు. ప్రత్యేక హోదా గురించి కూడా ఆయన మాట్లాడారు.
హోదా అంశాన్ని ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చూసుకుంటారని చెప్పారు. ఐదు రోజుల క్రితం తిరుపతి బహిరంగ సభలో ప్రత్యేక హోదా పైన ప్రజల అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ వెల్లడించారన్నారు.
హోదాను ప్రకటించాలి: బోండా ఉమ
ఏపీకి న్యాయం చేసే విషయంలో కేంద్రంలో కదలిక వచ్చిందని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు అన్నారు. వెంటనే ఏపీకి హోదా, రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.హోదా ఏపీ ప్రజల హక్కు అన్నారు. కేంద్రం హోదా పైన కుంటిసాకులు చెప్పవద్దన్నారు.
ఎలాంటి సాకులు చెప్పకుండా అమలు చేయాలన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అంశాన్ని పెట్టిందన్నారు. కేంద్రం నుంచి ఏపీకి ఇప్పటి వరకు కేవలం రూ.8,403 కోట్లు మాత్రమే వచ్చాయని ఆయన చెప్పారు.
సుజనపై నిప్పులు
కల్లబొల్లి కబుర్లు చెబుతూ ఎంత కాలం ప్రజలను మోసం చేస్తారని ఎమ్మెల్సీ చెంగల్రాయుడు టీడీపీ నేతలను గురువారం ప్రశ్నించారు. సుజనా చౌదరి హోదా పైన ప్రెస్ మీట్ పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై చెంగల్రాయుడు స్పందించారు. గతంలో సుజనా ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టారని, వాటిల్లో ఆయన చెప్పిన వాటిలో ఎన్ని కార్యరూపం దాల్చాయో అందరికీ తెలుసన్నారు.
ఇదే వరుసలో ఆయన మరో ప్రెస్ మీట్ పెట్టారన్నారు. బుందేల్ ఖండ్ తరహా సాయం అంటే ఏమిటో ముందు ఆయనకు తెలుసా అని ప్రశ్నించారు. పోనీ ఆయన చెబుతున్నట్టే ప్యాకేజీకి ఓకే అందామని, అయితే ఈ ప్యాకేజీతో ప్రజలకు నేరుగా జరిగే ప్రయోజనమేమిటని ప్రశ్నించారు. నేతల అవసరాలు తీరడానికి ప్యాకేజీతో సర్దుకుపోతున్నట్టు అనిపిస్తోందన్నారు.
సుజనా బిజెపి నేతనా, లేక ఏపీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారా అని చెప్పాలని ప్రత్యేక హోదా సాధన సమాఖ్య నేత చలసాని శ్రీనివాస్ సందేహం వ్యక్తం చేశారు. సుజనా ప్రెస్ మీట్లో ఫక్తు బిజెపి నేతలా మాట్లాడారన్నారు. ఆయన చెబుతున్న ప్రతిపాదన పెళ్లి చేసుకోను కానీ, అన్నీ చేస్తాన అన్నట్లుగా ఉందన్నారు.
రెండేళ్లుగా అందరు హోదా గురించి మాట్లాడుతుంటే టిడిపి నేతలు మాత్రం రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు. హోదా ఇవ్వడానికి రాజ్యాంగం అంగీకరించకపోతే ప్రధాని మోడీ ఏపీ ఉద్ధరణ పథకాన్ని ప్రవేశపెట్టి, దానికి చట్టబద్ధత కల్పించి, రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నారు. అది అసాధ్యమని వారే చెబుతారు కనుక, ఇవ్వాలన్నారు. హోదా రాదు అని ప్రజల్లోకి వచ్చి నేరుగా చెప్పాలని సవాల్ విసిరారు. రైల్వే జోన్ ఎన్నికల ముందు ప్రకటిస్తారని, దాని వెనుక రాజకీయ క్రీడ దాగుందన్నారు.