అమ్మవారి చీర మాయం ఘటన వ్యవహారంలో...పాలకమండలి సభ్యురాలు సూర్యలతపై సస్పెన్షన్ వేటు
విజయవాడ:బెజవాడ కనకదుర్గ అమ్మవారి చీర మాయం ఘటనపై ప్రభుత్వం స్పందించింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాలకమండలి సూర్యలతపై సస్పెన్షన్ వేటు పడింది.
అంతేకాదు సూర్యలతకు అధికారులు నోటీసులు సైతం జారీ చేశారు. విచారణ పూర్తి అయ్యేవరకు పాలకమండలి నుంచి సూర్యలతను తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. అమ్మవారికి మొక్కుబడిగా చెల్లించిన చీర మాయమైన ఘటనలో భక్తుల పిర్యాదుతో పాలకమండలి ఛైర్మన్ గౌరంగబాబు విచారణ చేస్తున్నారు.అయితే, సూర్యలతపై నివేదికను ప్రభుత్వానికి పంపే ముందు ఈవో పద్మ వన్టౌన్ పోలీసులతో మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే...

కృష్ణాజిల్లా ఉండవల్లికి చెందిన సుమారు 2 వందల మంది భక్తులు ఈ ఆదివారం ఆషాఢమాస సారెను అమ్మవారికి సమర్పించారు. సారెతోపాటు అమ్మవారికి రూ. 18వేలు విలువ చేసే పట్టు చీరను కూడా సమర్పించారు. అయితే కాసేపటికే ఆ చీర కనిపించకుండా పోయిందని ఆలయ అధికారులకు భక్తులు పిర్యాదు చేశారు. సూర్యలతే ఆ చీరను తీశారని భక్తులు తమ పిర్యాదులో పేర్కొన్నారు.
చీర మాయం విషయంపై ప్రభుత్వం కూడా సీరియస్ అయిన నేపథ్యంలో ఈవో నివేదికను రూపొందించారు. సీసీ టీవీ ఫుటేజి లేకపోయినా ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం నమోదు చేసినట్లు ఈవోకు పోలీసులు తెలిపారు. ఆలయ ట్రస్టు బోర్డులోని సభ్యురాలు సూర్యలత దుర్గమ్మ చీరను తీసినట్లు రిపోర్టులో స్పష్టం చేశారని తెలిసింది. దీంతో వాంగ్మూల నమోదు ప్రతిని తనకు ఇవ్వాలని ఈవో పద్మ పోలీసులను కోరారు.
చీర తీసిన పాలకమండలి సభ్యురాలిపై కేసు నమోదయితే ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుంది కనుక కేవలం చర్యలు మాత్రమే తీసుకోవాలని ఈవో తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. తదనంతరం ప్రాథమిక విచారణ చేసిన అధికారులు సూర్యలతను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications