జగన్ కుట్రపూరిత ఆలోచన: ఆ రెండు పార్టీల భూదందా అంటూ కన్నా లక్ష్మీనారాయణ ఫైర్
గుంటూరు: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం కుట్రపూరిత ఆలోచనేనని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడాన్ని తమ పార్టీ ఖండిస్తోందని అన్నారు. శనివారం గుంటూరులో బీజేపీ కోర్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
టీడీపీ, వైసీపీ భూ దందాలు..
రాజధాని అంశం కేవలం 29 గ్రామాల సమస్య కాదనీ.. మొత్తం రాష్ట్ర ప్రజల అంశంగా గుర్తించాలని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలూ భూ దందాలు చేస్తున్నాయని ఆరోపించిన ఆయన.. రాజధాని అక్రమాలు, ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ ఆరోపణలు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. జగన్ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటే కుదరదని అన్నారు.
జగన్ కుట్రపూరిత ఆలోచనే..
పరిపాలన వికేంద్రీకరణ ముసుగులో రాజధానిని తరలిస్తున్నారని, ఇది రాజకీయ ప్రేరేపిత చర్య అని కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నేతగా అమరావతి రాజధానిని సమర్థించారని ఆయన గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని మండిపడ్డారు. ప్రస్తుతం జగన్ కుట్రపూరిత ఆలోచనలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
అమరావతే రాజధాని..
పాలన వికేంద్రీకరణ కాకుండా.. అభివృద్ధి వికేంద్రీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని తాము కోరుతున్నామని అన్నారు. అమరావతి రాజధానిని ఎవరూ వ్యతిరేకించలేదని చెప్పారు. ప్రభుత్వం మారినంత మాత్రాన రాజధాని మార్చకూడదని అన్నారు. రాష్ట్రాభివృద్ధితో ముడిపడిన అంశాలతో ఇష్టమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవడం సరికాదని హితవు పలికారు. ఇలాంటి నిర్ణయాల కారణంగా పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రారని అన్నారు.
ఆ సత్తా బీజేపీకే ఉంది..
రాజధాని రైతుల సమస్య కాదని.. ఐదు కోట్ల ప్రజల సమస్య అని, అభివృద్ధితో ముడిపడి ఉన్న అంశమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అనేక రకాలుగా సాయం చేసిందని కన్నా తెలిపారు. రాష్ట్రం ఏర్పాటైన కొద్ది కాలంలోనే కేంద్రం రాష్ట్రానికి అనేక విద్యా సంస్థలు ఇచ్చిందని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. సంక్రాంతి తర్వాత రాజధాని అంశంపై ప్రత్యక్ష పోరాటంలోకి దిగాలని బీజేపీ నిర్ణయించిందని ఆయన తెలిపారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది తమ ఆలోచన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కలలను సాకారం చేసే సత్తా.. దేశానికి అవినీతి రహిత పాలన అందిస్తున్న బీజేపీతోనే సాధ్యమవుతుందని అన్నారు.