జగన్ ధ్వంస రచన చేస్తున్నారు: ‘అమరావతే రాజధాని’ అంటూ కన్నా లక్ష్మీనారాయణ ఫైర్
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరుగుతున్న రైతుల ఆందోళనలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి కిషోర్ బాబు బుధవారం మద్దతు తెలిపారు. అమరావతి రైతులకు న్యాయం జరిగే వరకు తాము కూడా రైతులకు అండగా ఉండి పోరాటం చేస్తామని వారన్నారు.

జగన్ ధ్వంస రచన చేస్తున్నారు..
ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. అధికారమిస్తే స్వర్గాన్ని చూపిస్తామంటూ జగన్ ఆశ చూపారని.. ఇప్పుడేమో ధ్వంస రచన చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని తరలింపు ఓ పిచ్చి ఆలోచన అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అప్పుడెందుకు అంగీకరించారు?
ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతిని ఎందుకు అంగీకరించారు? అని జగన్మోమన్ రెడ్డిని ప్రశ్నించారు కన్నా లక్ష్మీనారాయణ. రాజధాని రైతుల సమస్య మాత్రమే కాదని, రాష్ట్ర ప్రజలందరి సమస్య అని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం రూ. 2,500 కోట్ల నిధులిచ్చిందని, ఇదంతా ప్రజల సొమ్ము అని అన్నారు.

అమరావతి కోసం పోరాటం అంటూ..
రాజధాని అమరావతి కోసం బీజేపీ పోరాడుతుందని కన్నా స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలోనే ఉండాలనేది బీజేపీ డిమాండ్ అని అన్నారు. కాగా, తుళ్లూరు రైతుల మహాధర్నాకు స్వామి శివనంద లహరి హాజరయ్యారు. రాజధాని అమరావతి సాధన కోసం మహా చండీయాగం నిర్వహిస్తామని ఆయన అన్నారు.

అమరావతిలో ఆగని నిరసనలు
ఇప్పటికే మూడు రాజధానుల నిర్ణయాన్ని తెలుగుదేశంతోపాటు పలు పార్టీల రాజకీయ నేతలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అమరావతిలో భూములిచ్చిన రైతులు కూడా భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అమరావతి రాజధానికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించడంతోనే తాము భూములు ఇచ్చామని.. ఇప్పుడు తమకు తిరిగి భూములు ఇచ్చేస్తామంటే ఏం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు గత వారం రోజులుగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని అన్నారు. పాలన కేంద్రీకృతంగా ఉండాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్నారు.












Click it and Unblock the Notifications