'ఆయన్ను' చూసి 3 నియోజకవర్గాల అభ్యర్థులు గజగజ??
సీనియర్ రాజకీయనేత అయిన కన్నా లక్ష్మీనారాయణ మొన్నటి వరకు భారతీయ జనతాపార్టీ ఏపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన సారథ్యంలోనే 2019 ఎన్నికలను ఎదుర్కొన్నారు. తాను కూడా ఎంపీగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఇటీవలే బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరుసగా మూడుసార్లు సమావేశాలు ఏర్పాటు చేసి విమర్శించారు. విభేదాలు వద్దని అధిష్టానం చెప్పడంతో ప్రస్తుతం సైలెంటయ్యారు. అయితే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కన్నాను కలిసి చర్చించారు. దీంతో కన్నా జనసేనలోకి వెళతారనే ప్రచారం నడుస్తోంది.

కేసీఆర్ పై మండిపడ్డ కన్నా
అంతేకాకుండా ఆయన తాజాగా కేసీఆర్ పై మండిపడ్డారు. తెలంగాణలో బండి సంజయ్ ను, ఏపీలో పవన్ కల్యాణ్ ను బలహీనం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. కన్నా లక్ష్మీనారాయణ కాపు సామాజికవర్గానికి చెందిన నేత. ఉమ్మడి గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి వరుసగా 4సార్లు పోటీచేసి విజయం సాధించారు. తర్వాత 2009లో గుంటూరు పశ్చిమ నుంచి గెలుపొందారు. 2014లో ఓటమిపాలయ్యారు. ఒకానొక సమయంలో ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన పేరును కూడా పరిశీలించిందికానీ పదవి దక్కలేదు.

బీజేపీ పరిణామాలపై కన్నా అసంతృప్తి
బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై కన్నా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సోము వీర్రాజుతోపాటు మరో ముగ్గురు నేతలపై పదునైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ గమనించిన రాజకీయ విశ్లేషకులు కన్నా బీజేపీలో ఉండరని, జనసేనలో చేరతారని అంచనా వేస్తున్నారు. కన్నా జనసేనలో చేరితే గుంటూరు పశ్చిమ, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో ఏదో ఒకదాన్నుంచి పోటీచేస్తారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన పొత్తు పెట్టుకొని పోటీచేయడం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో కన్నా కూడా జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

టీడీపీలో చేరతారనుకున్నారుకానీ..
ఇటీవల ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారనుకున్నారుకానీ జనసేనలో చేరతారంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కన్నా జనసేనలో చేరితో పై మూడు నియోజకవర్గాల్లో ఒక దాన్నుంచి పోటీచేయాల్సి ఉంటుంది. పెదకూరపాడు నుంచి కొమ్మాలపాటి శ్రీధర్, సత్తెనపల్లి నుంచి కోడెల శివరాం, ఆంజనేయులు, గుంటూరు పశ్చిమ నుంచి కోవెలమూడి నాని, మన్నవ మోహన్ కృష్ణతోపాటు పలువురు పోటీపడుతున్నారు. పొత్తులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెనాలి, గుంటూరు పశ్చిమ, సత్తెనపల్లి నియోజకవర్గాలను కేటాయించమని జనసేన పట్టుబడుతోంది. ఒకవేళ కన్నా జనసేనలో చేరితో గుంటూరు పశ్చిమ నుంచికానీ, సత్తెనపల్లి నుంచి కానీ పోటీచేసే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications