షాను హత్య చేయాలనే దాడి, జగన్, పవన్లతో అక్రమ బంధమా?: బాబును ఏకేసిన కన్నా
అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రధానిపై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ధర్నాచౌక్లో భారతీయ జనతా పార్టీ, నేతలు ధర్నాకు దిగారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతోపాటు సీనియర్ నేత పురంధేశ్వరి, మాజీ మంత్రి మాణిక్యాలరావు, విష్ణువర్ధన్ రెడ్డి, సురేష్ రెడ్డి, రమేష్ నాయుడులు పాల్గొన్నారు.

చంద్రబాబు విఫలం
ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. పోలీసులను ఉపయోగించుకుని ముఖ్యమంత్రి తన ప్రత్యర్ధులపై దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు జిల్లాల పర్యటన సందర్భంలో స్థానిక బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాల్లో సీఎం పర్యటన సందర్భంగా, బీజేపీ నేతలను గృహనిర్భందం చేశారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.

అమిత్ షా హత్యకు కుట్ర
టీడీపీలో చేరకపోతే కేసులు బెడతామంటూ పోలీసులతో బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. పోలీసులు దమన కాండ సాగిస్తున్నారని, అధికార పక్షానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని కన్నా ఆరోపించారు. అలిపిరిలో అమిత్ షాపై రాళ్లదాడి చంద్రబాబు ఆదేశాలతోనే జరిగిందని ఆయన ఆరోపించారు. అమిత్ షాను హత్య చేయాలనే ఉద్దేశంతోనే దాడి చేశారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. దీనిపై పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే బీజేపీ కార్యకర్తలపై ఎదురు కేసులు పెట్టారని కన్నా ధ్వజమెత్తారు. గతంలో సోము వీర్రాజు ఇంటిపై టిడిపి కార్యకర్తలు దాడి చేశారని గుర్తుచేశారు.

మరోసారి బాబును గెలిపిస్తే..
ఏపీ ప్రజలను ప్రధాని నరేంద్ర మోడీ మోసం చేయలేదని, కుట్ర రాజకీయాలతో చంద్రబాబే రాష్ట్ర ప్రజలను మోసం చేశారని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఇప్పటికే అవినీతి, అక్రమ పాలన కొనసాగిస్తున్న చంద్రబాబుకు మరోసారి అవకాశమిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన దేవెగౌడ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చంద్రబాబు చేతులు కలిపారని మండిపడ్డారు.

అన్నంపెట్టిన చేతిని నరకడం బాబుకు అలవాటే
చంద్రబాబే పెద్ద మోసగాడని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. 2014 నుంచి ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉండి సాయం చేస్తున్న ప్రధాని మోడీని మోసగాడని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అన్నంపెట్టే చేతులను నరకడం చంద్రబాబుకు అలవాటేనని కన్నా వ్యాఖ్యానించారు. ఇప్పుడు బీజేపీ, మోడీపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. బలమైన ప్రచార సాధానాలతో ఒక అబద్ధాన్ని వెయ్యిసార్లు మాట్లాడించి నిజం చేద్దామని చూస్తున్నారని ఆరోిపంచారు. ప్రజల సమస్యను పక్కదారి పట్టించి మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని చంద్రబాబుపై కన్నా మండిపడ్డారు.

బాబు మోసగాడని ఎన్టీఆర్ కూడా చెప్పారు
చంద్రబాబు ఒక ద్రోహి, అవినీతి పరుడని ఎన్టీఆర్ కూడా చెప్పేవారని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. చంద్రబాబు చీకటి, కుట్ర చరిత్రని అన్నారు. బాబు చరిత్రేంది? మోడీ చరిత్రేంది అని ప్రశ్నించారు. తమ కర్మ కొద్దీ టీడీపీతో నాలుగు సంవత్సరాలు కలిసి సాగామని కన్నా అన్నారు. విజయవాడలో ఇష్టమొచ్చినట్లు కళ్యాణ మండపాలు, హ్యాపీ సండేలను నిర్వహిస్తూ ప్రజల సొమ్మును వృథా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు ఎవరూ హ్యాపీగా లేరని కన్నా అన్నారు.

కుట్ర, వంచన రాజకీయం
టెంపరరీ సెక్రటరీ పేరుతో అవినీతికి పాల్పడ్డారని, రాజధాని భూముల పేరుతో లాండ్ స్కాంలు చేశారని చంద్రబాబుపై కన్నా ఆరోపించారు. చంద్రబాబు అవినీతి రాస్తే 300ల పేజీలు కూడా సరిపోవని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అన్ని కులాలను మోసం చేశారని దుయ్యబట్టారు. మోసం చేయడానికి కులాలు, ప్రకటించడానికి పథకాలు కూడా చంద్రబాబుకు ఇప్పుడు లేవని అన్నారు. చంద్రబాబు రాజకీయం మొత్తం కుట్ర, వంచనలతోనే సాగిందని మండిపడ్డారు.

పవన్, జగన్తో అక్రమ బంధమా?
బీజేపీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు అక్రమ సంబంధం అంటకడతారా? అంటూ ధ్వజమెత్తారు. ఆ పార్టీలకు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని ప్రచారం చేస్తున్నారని మండిపడ్ారు. అప్పుడు వాజ్పాయిని చేసినప్పటికీ.. చంద్రబాబును ప్రధాని నరేంద్ర మోడీ నమ్మారని అన్నారు. వయస్సు పెరిగింది మారి ఉంటారని మోడీ.. చంద్రబాబుకు అధికారం కట్టబెడితే.. అన్నం పెట్టిన చేయినే నరికేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ను కూడా మోసం చేసి చంపారని చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఏపీకి సాయం చేసిన మోడీని మోసం చేయడమేగాక, ఆయనను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ఏపీకి చంద్రబాబు ఏం చేశారు?
చంద్రబాబు ఏపీకి ఏం చేశారో చెప్పగలరా? అని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. పోలవరంపై ఖర్చు పెట్టే ప్రతీపైసా కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. కేంద్రం నిధులతో చంద్రన్న బీమా అమలు చేస్తున్నారని తెలిపారు. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, అవినీతిని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రైతులను మోసం చేస్తూ, ధాన్యం నింపే బస్తాల్లో కూడా అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు పందికొక్కుల కంటే హీనంగా దోచుకుంటున్నారని కన్నా ధ్వజమెత్తారు. ఎన్నికలు ఏడాది ఉందనగా, ఇప్పుడు పథకాలు ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. గృహ నిర్మాణాల్లోనూ అవినీతి విచ్చలవిడిగా సాగుతోందని అన్నారు. కేంద్రం డబ్బులిస్తే చంద్రబాబు, టీడీపీ.. కేంద్రంపైనే దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. మోడీ గ్రామీణాభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తే.. చంద్రబాబు సర్కారు పక్కదారులు పట్టిస్తోందని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications