బిజెపిXటిడిపి: చరిత్రహీనుడిగా.. బాబుపై కన్నా తీవ్ర వ్యాఖ్యలు, 'కృష్ణయ్య మాటేంటి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ శనివారం నాడు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారన్నారు.
ఎన్నికలకు ముందు కాపులను బీసీల్లో చేరుస్తామని ఆయన హామీ ఇచ్చారని, ఇప్పుడు దానిని మరచిపోయారని ఆరోపించారు. కాపులను బీసీల్లో చేర్చే విషయమై పుట్టు స్వామి కమిషన్ నివేదిక ఉండగానే, దానిని పక్కన పెట్టి, మరో కమిటీని వేయడంతో కాపుల్లో ఆందోళన మరింతగా పెరిగిందన్నారు.
ఆదివారం నాడు జరగనున్న కాపు గర్జన ప్రభావం మొదటపడేది చంద్రబాబుపైనే అని కన్నా అన్నారు. ఈ సభకు లక్షలాది ప్రజలు ఇప్పటికే బయలుదేరారన్నారు. వీరిని అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులను మోహరిస్తోందన్న సమాచారం ఉందని, ఇది బాధాకరమన్నారు.
కాపు సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశ పెట్టాలని, అందుకు తాము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని మండలిలో వైసిపి పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. కేంద్రంలో టిడిపికి మిత్రపక్షమైన బిజెపి అధికారంలో ఉందని, కాబట్టి పార్లమెంటులో కాపు రిజర్వేషన్ల పైన తీర్మానం ఆమోదింప చేయాలన్నారు.
టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య కాపు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఉంటే చంద్రబాబు ఆయనకు ఎందుకు నచ్చ చెప్పడం లేదన్నారు. దీనిని బట్టి చంద్రబాబే ఓ వైపు కాపులకు రిజర్వేషన్ అని చెబుతూ, మరోవైపు అవి అమలు జరగకుండా అడ్డుకుంటున్నట్లుగా కనిపిస్తోందన్నారు.
మరోవైపు, కాపులను బీసీల్లో చేర్చితే రాష్ట్రం అగ్ని గుండంగా మారుతుందని అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్రయ్య హెచ్చరించారు. కాపు, బలిజల్లో అత్యంత వెనుకబడిన వారి అభివృద్ధికి కృషి చేస్తే మాత్రం వ్యతిరేకించమని చెప్పారు.