చెప్పండి, జీవో ఇచ్చేద్దామా: బాబు, ముద్రగడతో చర్చకు సీఎం విముఖత?
విజయవాడ: కాపు రిజర్వేషనేల పైన జీవో ఇస్తామంటే ఇద్దామని, ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారని తెలుస్తోంది. కాపు గర్జన, తుని విధ్వంసం నేపథ్యంలో కాపు నేతలు, మంత్రులతో చంద్రబాబు సోమవారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిలబడని జీవో వల్ల ఉపయోగం లేదని మంత్రులు ఈ సందర్భంగా అన్నారు. జీవో ఇచ్చిన తర్వాత కోర్టు నిలిపివేస్తే అంతిమంగా ప్రభుత్వానికి, పార్టీకి నష్టమని మంత్రులు చెప్పారు.
కాపు కార్పోరేషన్, కమిషన్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈ విషయంలో ఎవరినీ నొప్పింపకుండా, ప్రభుత్వానికి నష్టం కలుగకుండా చూసేలా ఏవైనా నిర్ణయాలుంటే చెప్పాలని చంద్రబాబు మంత్రులను కోరారు.
ఇప్పటికిప్పుడు ఎటువంటి నిర్ణయాలూ తీసుకోవద్దని మంత్రులు సూచించారని తెలుస్తోంది. కాపులను బీసీల్లో కలిపేందుకు తాను వ్యతిరేకం కాదని, ఇతర వర్గాల నుంచి వచ్చే విమర్శలను, ఉద్యమాలను తట్టుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు అన్నారని సమాచారం.
తునిలో సంఘటనలు, కేసుల నమోదు.. దర్యాఫ్తులో పురోగతిని ముఖ్యమంత్రికి డిజిపి రాముడు వివరించారు. మరోవైపు కాపు సంఘం నేతలకు రేపు చంద్రబాబు అపాయింటుమెంట్ ఇచ్చారు. అయితే, ముద్రగడ పద్మనాభం విషయంలో మాత్రం చంద్రబాబు విముఖత చూపుతున్నట్లుగా తెలుస్తోంది. మిగిలిన కాపు నేతలతో మాట్లాడేందుకు ఓకే చెప్పిన చంద్రబాబు.. ముద్రగడతో భేటీకి మాత్రం నో చెప్పారని అంటున్నారు.
జగన్ మానసిక స్థితి బాగాలేదు: దేవినేని
వైసిపి అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మానసిక పరిస్థితి బాగా లేదని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ఏపీలో అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారన్నారు. పట్టిసీమ పైన లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ విఫలమయ్యారన్నారు. జగన్ వల్లే తునిలో హింస జరిగిందని ఆరోపించారు. అవినితి సొమ్ముతో జగన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.