2024 ఎన్నికల్లో వైసీపీని ఓడించాలంటే..: అలా జరిగితే గానీ: చంద్రబాబుకు కీలక సూచన
అమరావతి: ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలన్నీ తెలుగుదేశం పార్టీ- జనసేన పొత్తుల వ్యవహారాల చుట్టే తిరుగుతున్నాయి. మొన్నీ మధ్యే టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కలుసుకున్న తరువాత మొదలైన ఊహాగానాలకు తెర పడట్లేదు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖాయమైందనే వార్తలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సీట్ల పంపకాలు మాత్రమే మిగిలివున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి.
హరిరామ లేఖ..
ఈ పరిణామాల మధ్య కాపు సంక్షేమ సేన నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య కీలక సూచనలు చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే పొత్తులు తప్పవని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండటానికి పొత్తులు అత్యవసరమనీ అన్నారు. పొత్తులు ఉంటే తప్ప వైసీపీని ఓడించలేమనీ చెప్పారు.
టీడీపీ-జనసేన..
వైసీపీని ఓడించే సత్తా టీడీపీ-జనసేనకే ఉందని, ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటేనే అది సాధ్యపడుతుందనీ హరిరామ జోగయ్య తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ఉండాలనేదే కాపు సంక్షేమ సేన డిమాండ్ అని పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో 22 శాతం ఉన్న కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం దక్కి తీరాల్సిందేనని, రాజ్యాధికారం అంటే ముఖ్యమంత్రి పదవేననీ వ్యాఖ్యానించారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను దక్కించుకోవాలనేది తమ రెండో డిమాండ్ అని గుర్తు చేశారు.
జగన్ ది రాక్షసపాలనగా..
అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపైనా చేగొండి హరిరామ జోగయ్య ఘాటు విమర్శలు చేశారు. వైసీపీది రాక్షస పరిపాలనగా అభివర్ణించారు. అభివృద్ధి రహితంగా వైఎస్ జగన్ పరిపాలన సాగిస్తోన్నారని మండిపడ్డారు. పాలన మొత్తం అవినీతిమయమైందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడంతో పాటు పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేయాలనేదే తమ డిమాండ్ అని అన్నారు.
కాపు కులస్తులకే..
టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని అధికారంలోకి రాగలిగితే- తమ ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ పేరును ప్రకటించాల్సి ఉంటుందని మెలిక పెట్టారు హరిరామ జోగయ్య. కాపు సామాజిక వర్గం చేతుల్లోకి పరిపాలన రావాల్సిన అవసరం ఉందని, తమ ఎదురు చూపులు ఫలించాలని అన్నారు. బడుగు, బలహీన వర్గాలను అధికారంలో భాగస్వామ్యులను చేయాలని చెప్పారు. ఈ డిమాండ్ల సాధనే ధ్యేయంగా జనసేన పార్టీకి అనుబంధంగా కాపు సంక్షేమ సేన ఆవిర్భవించిందని అన్నారు.