కోనసీమ జిల్లాకు ఆ టీడీపీ నేత పేరు-జగన్ కు ముద్రగడ డిమాండ్-కారణాలు చెప్పి మరీ
ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, పార్టీ విపక్షంలో ఉన్నా దాంతో సంబంధం లేకుండా నేతలకు లేఖలు రాయడంలో కాపు నేత ముద్రగడ పద్మనాభం దిట్ట. మాజీ మంత్రిగా, కాపు నేతగా బలమైన వర్గం అండ కలిగిన ముద్రగడ తన లేఖలతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి ఆయన సీఎం వైఎస్ జగన్ కు ఓ కీలక డిమాండ్ తో లేఖ రాశారు. జిల్లాల విభజనకి శ్రీకారం చుట్టిన సందర్భంగా మాజీ లోక్ సభ స్పీకర్ బాలయోగి గారి పేరు అమలాపురం జిల్లాకి, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో మరొక జిల్లాకి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టాలని కోరానని ముద్రగడ తన తాజా లేఖలో సీఎం జగన్ కు గుర్తుచేశారు.
బాలయోగి రాజకీయాల్లోకి రాకముందు కోనసీమలో ఇరుకైన రోడ్లు ఉండేవని, సాయంత్రం అయితే ఇళ్ళలో దీపాలు కిరోసిన్ దీపాలకన్న చాలా తక్కువ కాంతితో వెలుగుతూ ఉండేవని ముద్రగడ తెలిపారు. కాకినాడ నుంచి అమలాపురం వెళ్ళాలంటే యానాం రేవు నుంచి గోదావరిలో పడవపై వెళ్లాల్సి వచ్చేదన్నారు. అలాంటి కోనసీమకి బాలయోగి తీవ్రమైన కృషితో విశాలమైన రోడ్లు, బల్బులు, ట్యూబ్ లైటు కాంతి కన్నా ఎక్కువ వెలుతురుతో వెలిగే ఏర్పాటు చేశారని ముద్రగడ తెలిపారు. పడవ ప్రయాణం బదులు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేయడం కోసం యానాం ఎదుర్లంక బ్రిడ్జి సదుపాయం లాంటివి బాలయోగి చేశారని గుర్తు చేశారు.

అలాగే గతంలో ఎన్.హెచ్-5 ని నాలుగు వరుసల రోడ్డుగా మార్పు చేయడానికి అధికారులు రావులపాలెం మీదుగా కాకుండా కొవ్వూరు, దేవరాపల్లి మీదుగా గుండుగొలను వరకు చేయాలనే ప్రయత్నానికి అడ్డు పడి... ఉన్న రోడ్డుని రావులపాలెం మీదుగా నాలుగు వరుసలు చేయాలని కోరారని గుర్తుచేశారు.అలాగే మీరనుకున్నట్లుగా కొవ్వూరు, దేవరాపల్లి, గుండుగొలను రోడ్డు కూడా చేయండి. అంతేగాని పూర్వం నుండి ఉన్న ఎన్. హెచ్-5ని మార్చవద్దని వారు చెప్పడం మూలంగా నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం అయ్యిందన్నారు. ఇలాంటి సదుపాయాలు ఎన్నో చేసిన మహావ్యక్తి బాలయోగి అని కొనియాడారు. వారి పేరు కోనసీమ జిల్లాకి పెట్టడం న్యాయమని ముఖ్యమంత్రికి తెలిపారు.
Recommended Video

అవసరం అయితే తాను రాసింది వాస్తవం అవునో కాదో విచారణ చేసి నిజమైతేనే అదిశగా ఆలోచన చేయమని ముద్రగడ సీఎం జగన్ ను కోరారు. అలాగే డాక్టర్ అంబేద్కర్ గురించి తన లాంటి వ్యక్తి వ్రాయవలసిన అవసరం లేకుండానే వారి చరిత్ర ప్రపంచానికి తెలుసన్నారు. అటువంటి మహనీయులు పేరు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ జిల్లాకి పెట్టమని ముద్రగడ కోరారు. బాలయోగి, డా.అంబేద్కర్ లాగ ప్రపంచనేత కాకపోయిన కోనసీమ అభివృద్ధికి కష్టపడ్డ మహనీయులని, అటువంటి చరిత్ర పురుషులను గౌరవించడం కోసం సీఎం జగన్ పెద్ద మనస్సు చేసుకుని చరిత్రలో నిలిచిపోయే ఆలోచన చేయమని ముద్రగడ కోరారు.












Click it and Unblock the Notifications