బాలకృష్ణకు కాపునాడు వార్నింగ్: పెదవి విప్పని పవన్- పొత్తు పోతుందనే భయం..?!
అమరావతి: ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ- మరో వివాదానికి తెర తీశారు. అలగాజనం అంటూ ఇదివరకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంపై పరోక్షంగా ఘాటు విమర్శలు చేసిన ఆయన ఇప్పుడిక అక్కినేని కుటుంబంపై కామెంట్స్ చేశారు. ఆ ఫ్యామిలీని కించపరిచేలా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కినేని నాగార్జున అభిమానులు బాలయ్యను ట్రోల్ చేస్తోన్నారు.
అక్కినేనిపై..
వీరసింహా రెడ్డి సక్సెస్ మీట్ లో బాలకృష్ణ ఫ్లోలో అన్నారో లేక.. ఉద్దేశపూరకంగా చెప్పారో గానీ.. అక్కినేని కుటుంబం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కినేని.. తొక్కినేని అంటూ మాట్లాడారు. తొలితరం దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావు పేరును కూడా ప్రస్తావించారు. మా ఆర్టిస్టులు అంత నాకు మంచి టైమ్ పాస్, వేదాలు శాస్త్రాలు నాన్నగారు, ఆ రంగారావు ఈ రంగారావు, అక్కినేని తొక్కినేని.. ఇవన్నీ కూర్చొని మాట్లాడుకునేవాళ్లమని అన్నారు.
నాగచైతన్య రియాక్ట్
అక్కినేని నాగేశ్వర రావు వర్ధంతి నాడే ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2014 జనవరి 22వ తేదీన అక్కినేని కన్నుమూశారు. అదే రోజు అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశించి తొక్కినేని అంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించడం పట్ల నాగార్జున అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు. అక్కినేని నాగచైతన్య స్పందించారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా తప్పుపట్టారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వర రావు కళామతల్లి ముద్దుబిడ్డలని, వారిని అగౌరవపర్చడం అంటే తమను తాము కించపర్చుకోవడమేనని చెప్పారు.
కాపు నాడు అల్టిమేటం..
ఎస్వీ రంగారావు కాపు సామాజిక వర్గానికి చెందిన దిగ్గజ నటుడు. ఆయనను కూడా బాలకృష్ణ కించపర్చడం పట్ల కాపు నాడు తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేసింది. ఆ మేరకు ఆ కాపు నాడు ప్రతినిధులు బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చారు. ఈ సాయంత్రం లోగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
రంగా విగ్రహాల వద్ద..
క్షమాపణలు చెప్పకపోతే ఆయన అల్లుడు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటామనీ హెచ్చరించారు. కాపు సామాజిక వర్గ నాయకుడు, దివంగత వంగవీటి రంగా విగ్రహాల వద్ద ఇవ్వాళ నిరసన ప్రదర్శనలకు కాపునాడు నాయకులు పిలుపునిచ్చారు. ప్రతి రంగా విగ్రహం వద్ద కాపులు ధర్నా చేయాలని, విగ్రహానికి వినతిపత్రాలను అందించాలని కాపు నాడు ప్రతినిధులు సూచించారు.
పలకని పవన్ కల్యాణ్..
ఎస్వీ రంగారావును కించపర్చుతూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల తీవ్రత- కాపు సామాజికవర్గంలో అగ్గి రాజేసినప్పటికీ అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ ఇప్పటివరకు స్పందించకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సినిమా పరిశ్రమకే చెందిన వ్యక్తే అయినప్పటికీ ఎస్వీ రంగారావుపై చేసిన కామెంట్ల పట్ల ఖండించకపోవడాన్ని కాపులు తప్పుపడుతున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఎక్కడ చెడిపోతుందోననే భయం వల్లే పవన్ కల్యాణ్ పెదవి విప్పట్లేదని ఆరోపిస్తోన్నారు.