అక్రమాస్తి కోసమే మా పార్టీలోకి, ఇప్పుడొచ్చి పెత్తనమా: గొట్టిపాటిపై కరణం సంచలనం
అద్దంకి: గత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అద్దంకి నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ బుధవారం నాడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమయింది. ఇలాంటి సమయంలో అద్దంకి టిడిపి ఇంచార్జ్ కరణం బలరాం సంచలన వ్యాఖ్యలు చేశారు.
రకరకాల నాయకులు, నేతలు రకరకాల కారణాలతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని గొట్టిపాటిని ఉద్దేశించి అన్నారు. అక్రమ సంపాదన రక్షించుకునేందుకే కొందరు నేతలు తమ పార్టీలోకి వస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
పదేళ్లుగా తమ పార్టీ కార్యకర్తలు టిడిపి కోసం పోరాడారని, ఇప్పుడు కొత్త వారు వచ్చి అజమాయిషీ చేస్తే ఊరుకునేది లేదని, కుదరదని హెచ్చరించారు. చేరికల సమయంలో ఆయా నియోజకవర్గ నేతలతో ముందుగా చర్చించారని, కానీ అద్దంకిలో మాత్రం అందుకు భిన్న పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, రేపు గొట్టిపాటి రవి కుమార్ టిడిపిలో చేరుతున్నందున కరణం బలరాం విజయవాడకు వచ్చారు. ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
చంద్రబాబు మాట్లాడలేదా?
కాగా, ఎమ్మెల్యేల చేరిక సమయంలో టిడిపి ఇంఛార్జులతో చంద్రబాబు మాట్లాడి వారిని బుజ్జగించిన సందర్భాలు ఉన్నాయి. అయితే, కరణం బలరాం విషయంలో చంద్రబాబు దానిని పాటించలేదా అనే చర్చ సాగుతోంది. చంద్రబాబు ఆయనను ఒప్పించారా లేదా అనే చర్చ సాగుతోంది.
జగన్ పైన మంత్రులు అయ్యన్న, యనమల ఆగ్రహం
జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి నాడు చేసిన పనినే తాము (ఆపరేషన్ ఆకర్ష్) ఇప్పుడు చేస్తున్నామని మంత్రి అయ్యన్న పాత్రుడు చెప్పారు. జగన్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదన్నారు. అభివృద్ధిని చూసి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్పారు. చలివేంద్రాలపై వైసిపి రాజకీయం సరికాదన్నారు.
మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... ఏపీ ఇమేజ్ దెబ్బతీసేందుకే జగన్ ఢిల్లీ పర్యటన అని మండిపడ్డారు. అవినీతి కేసుల్లో ఉన్న జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. వైసిపి పుస్తకంలో అన్నీ అవాస్తవాలే అన్నారు.












Click it and Unblock the Notifications