కన్నడ ఎన్నికల్లో తెలుగు "హీరో"ల సత్తా - పిక్చర్ క్లియర్..!!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ సారి అక్కడ ఎన్నికలు కాంగ్రెస్ - బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. కర్ణాటకలోని పలు నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇక, కర్ణాటకలో తెలుగు హీరోలకు మంచి క్రేజ్ ఉంది. అవి ఓట్లుగా మలచుకొనేందుకు బీజేపీ పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. నందమూరి - మెగా కుటుంబాలకు కన్నడ సినీ ఇండస్ట్రీతో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఏ ఒక్క అవకాశం వదులుకోవటానికి బీజేపీ - కాంగ్రెస్ సిద్దంగా లేవు. కీలకమైన ఈ ఎన్నికల్లో తెలుగు హీరోలు ఎవరి వైపు.. సత్తా చూపిస్తారా.
కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. కర్ణాటకలోని బెంగళూరులోనే కాకుండా కోలారు - చిక్ బళ్లాపురం - రాయచూరు ప్రాంతాల్లో తెలుగువాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాంతాల్లోని తెలుగు వారి ఓట్లను కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ -బీజేపీ, బీఆర్ఎస్ సహకారంతో జేడీఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కర్ణాటకతో తెలుగు హారోల సంబంధాలు బలమైనవి. అక్కడి రాజకీయాల్లో తెలుగు హీరోలకు ప్రత్యక్షంగా సంబంధాలు లేకపోయినా.. ఈ సారి హీరోల ద్వారా తమ అభిమానుల ఓట్లను తమ వైపు మలచుకొనేందుకు బీజేపీ వ్యూహాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా..ముందుగా జూనియర్ ఎన్టీఆర్ కు తాజా ముఖ్యమంత్రి ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు.

పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న విశిష్ట పురస్కారం వేళ ప్రత్యేకంగా కర్ణాటక ప్రభుత్వం నుంచి తారక్ కు ఆహ్వానం అందింది. కర్ణాటకలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తారక్ ఫ్యాన్ సత్తా గ్రహించిన బీజేపీ అగ్ర నేత అమిత్ షా ముందుగానే హైదరాబాద్ కేంద్రంగా జూ ఎన్టీఆర్ తో సమావేశమయ్యారు. కానీ, తారక్ ఇప్పటి వరకు బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయలేదు. ఇక, తాజాగా చిరంజీవి, రాం చరణ్ తోనూ అమిత్ షా సమావేశమయ్యారు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవార్డు రావటంతో రాం చరణ్ ను ప్రత్యేక గౌరవించినట్లు వెల్లడించారు. అదే సమయంలో చిరంజీవిని ఆహ్వానించటం.. ఏపీ పర్యటనలో ప్రధాని మోదీ, ఢిల్లీలో చిరంజీవికి కేంద్ర హోం మంత్రి ఇచ్చిన ప్రాధాన్యత వెనుక పక్కా లెక్కలు ఉన్నాయనే వాదన ఉంది.
ఇటు పవన్ కల్యాణ్ గతంలోనూ బీజేపీకి అనుకూలంగా కర్ణాటకలో వ్యవహరించారు. కర్ణాటక బెంగుళూరు చెందిన యువ ఎంపీ ఏపీలో బీజేపీ - జనసేన మధ్య పొత్తులో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఏపీలో నే బీజేపీతో పవన్ దూరంగా ఉంటున్నారు. కర్ణాటక ఎన్నికల్లో మద్దతుగా పవన్ ముందుకొస్తారా అంటే అది సందేహమే. ఇదే సమయంలో తెలుగు రాజకీయాలు - సినిమాల్లో ప్రముఖంగా ఉన్న ప్రకాశ్ రాజ్ తొలి నుంచి బీజేపీకి వ్యతిరేకంగా ఉంటున్నారు. ఈ ఎన్నికల్లో తెలుగు సినీ హీరోలు ఎంత వరకు ఓపెన్ గా పార్టీలకు ప్రచారం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ పాత్ర పైన తెలుగు ఓటర్లలో చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications