అక్కినేనికి కన్నడ అసెంబ్లీ నివాళి: భానుచందర్ స్పందన
బెంగళూరు/హైదరాబాద్: ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వర రావు మృతి పట్ల కర్నాటక అసెంబ్లీ గురువారం సంతాపం ప్రకటించింది. భారత చలన చిత్ర పరిశ్రమకు అక్కినేని ఎనలేని సేవలు చేశారని శాసన సభ కొనియాడింది. బుధవారం ఆంధ్రప్రదేశ్ శాసన సభ అక్కినేని నాగేశ్వర రావు మృతి పట్ల సంతాపం తెలిపిన విషయం తెలిసిందే.
అక్కినేని మృతి పట్ల శాసన సభ సానుభూతి ప్రకటిస్తున్నట్లు నిన్న ఎపి శాసన సభాపతి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. చిత్ర పరిశ్రమకు అక్కినేని అందించిన సేవలు అమోఘమన్నారు. దశాబ్దాల సినిమా చరిత్రలో ఎన్నో పాత్రలకు జీవం పోశారన్నారు. ఆయన 256 చిత్రాల్లో నటించారని, పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య, పద్మభూషణ్, దాదాసాహెబ్ పాల్కె అవార్డులు అందుకున్నారని చెప్పారు.
మంచి నటుడిగానే కాకుండా సంఘజీవిగా అక్కినేని పలు సేవలు అందించారన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తనవంతు సాయం అందించారని, హైదరాబాదులో తెలుగు సినీ పరిశ్రమకు బలమైన పునాదులు వేశారన్నారు. శాసన సభ మౌనం పాటించి నివాళులు అర్పించింది.
దేవుడిని తలుచుకున్నట్లు.. శివ ప్రసాద్
తాను రోజు దేవుడిని తలుచుకున్నట్లు అక్కినేని నాగేశ్వర రావు కూడా తలుచుకుంటానని నటుడు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు శివప్రసాద్ హైదరాబాదులో అన్నారు. అక్కినేని ఎందరికో స్ఫూర్తిప్రదాత అన్నారు.
మాలాంటి వాళ్లు వస్తుంటారు పోతుంటారు కానీ.. భానుచందర్
తమలాంటి నటులు చాలామంది వస్తుంటారు.. పోతుంటారు కాని అక్కినేని నాగేశ్వర రావు లాంటి వారు ఎవర్ గ్రీన్ అని భానుచందర్ అన్నారు.