చిరంజీవితో డీకే చర్చలు - రాహుల్ సమక్షంలో : సినిమాలకు గ్యాప్ ఇస్తారా..!!
మెగాస్టార్ చిరంజీవి తిరిగి రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారా. కాంగ్రెస్ తోనే ఉంటారా..మరో పార్టీలో చేరుతారా. అసలు రాజకీయాల్లోకి తిరిగి ఎంట్రీ ఇచ్చేందుకు మెగాస్టార్ సిద్దంగా ఉన్నారా. కొంత కాలంగా అటు పొలిటికల్..ఇటు సినీ సర్కిల్స్ లో ఈ చర్చ కొనసాగుతోంది. అయితే, ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత...కొంత కాలంగా కేంద్ర మంత్రిగా వ్యవహరించిన చిరంజీవి 2014 ఎన్నికల తరువాత పూర్తిగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరమయ్యారు. ఇక, రాజ్యసభ సభ్యత్వ పదవీ కాలం ముగిసిన తరువాత కాంగ్రెస్ తోనూ దూరంగానే ఉంటున్నారు.
చిరంజీవి కోసం కాంగ్రెస్ నిరీక్షణ..
కానీ, కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేయలేదు. గతంలో బలంగా ఉండి..ప్రస్తుతం బలం కోల్పోయిన రాష్ట్రాల పైన కాంగ్రెస్ అధినాయకత్వం ఇప్పుడు ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా... రాహుల్ గాంధీ ఏపీలో పార్టీ సిట్యుయేషన్ పైన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఉమెన్ చాందీతో పాటుగా.. పార్టీ ముఖ్య నేతలు చర్చలు జరిపారు. ఏపీలో కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం ఏం చేయాలనే దాని పైన మేధో మధనం చేసారు. ఆ సమయంలోనే రాహుల్ మెగాస్టార్ అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో రేవంత్ తరహాలో ఏపీలోనూ పార్టీలో జోష్ లో నింపే వారు కావాలని చర్చించారు.
మెగాస్టార్ ను ఒప్పించే బాధ్యత డీకేకు..
ఈ క్రమంలో చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ లో తిరిగి యాక్టివ్ చేయాలనే అభిప్రాయం రాహుల్ వ్యక్తం చేసారు. అందులో భాగంగా.. ఉమెన్ చాందీతో పాటుగా కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివ కుమార్ కు ఆ మేర చిరంజీవిని ఒప్పించే బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో... తాజాగా డీకే శివ కుమార్ ఏపీ రాజకీయాలు..రాహుల్ అభిప్రాయం పైన చిరంజీవితో చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. జాతీయ స్థాయిలో బీజేపీ బలహీన పడుతోందని..కాంగ్రెస్ కేంద్రంలో కీలక పాత్ర పోషించనుందని చెప్పినట్లు తెలుస్తోంది.
చిరు చెప్పిన వారికే పీసీసీ బాధ్యతలు..
ఇదే సమయంలో ఏపీలో జగన్ ప్రభుత్వం పైన వ్యతిరేకత..టీడీపీ బలహీనడడుతున్న అంశాల పైన చర్చించినట్లుగా సమాచారం. ఏపీలో పార్టీ బలం పెరగాలని రాహుల్ కోరుకుంటున్నారని..అందు కోసం యాక్టివ్ పీసీసీ చీఫ్ గా నియమించాలని భావిస్తున్నారంటూ డీకే శివ కుమార్ వివరించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా చిరంజీవి కీలక బాధ్యతలు తీసుకోవాలని డీకే ప్రతిపాదించగా..మెగాస్టార్ నుంచి మాత్రం సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. దీంతో..మరింత సమయం తీసుకొని మరోసారి చర్చిద్దామంటూ డీకే చెప్పినట్లుగా సమాచారం.
చిరంజీవి నిర్ణయం మార్చుకుంటారా..
అదే సమయంలో పీసీసీ చీఫ్ గా కొత్త వారికి బాధ్యతల పైన డీకే చర్చల్లో భాగంగా చిరంజీవి అభిప్రాయం కోరినట్లు చెబుతున్నారు. చిరంజీవికి ప్రాధాన్యత పెంచే క్రమంలో ఆయన సూచించిన వారికే పీసీసీ ఇవ్వాలనేది రాహుల్ ఆలోచన అని చెబుతూ...చిరంజీవి అభిప్రాయం తెలుసుకొనే ప్రయత్నం చేసారు. అయితే, ఈ చర్చల్లో మాత్రం కాంగ్రెస్ నేతలు ఆశించిన ఫలితం చిరంజీవి నుంచి రాలేనది..దీంతో.. స్వయంగా చిరంజీవిని రానున్న రోజుల్లో డీకే శివ కుమార్ కలుస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.
Recommended Video
సినిమాలతోనే..పాలిటిక్స్ లోనా
చిరంజీవి వైసీపీ నుంచి రాజ్యసభకు నియమితులవుతారనే ప్రచారంతో..కాంగ్రెస్ నేతలు ఇందులో వాస్తవం ఎంత అనేది నిర్ధారించుకోవటంతో పాటుగా... చిరంజీవి తిరిగి యాక్టివ్ అవుతే ఏపీలో పార్టీ బలోపేతం అవుతుందని ఆశిస్తున్నారు. కానీ, చిరంజీవి మాత్రం ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆయన తిరిగి రాజకీయాల్లోకి రావటం..అందుకు ఒక వేళ మనసు మార్చుకున్నా..కాంగ్రెస్ నుంచి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారా అనేది సందేహమే. దీంతో..ఈ మొత్తం వ్యవహారం పైన చిరంజీవి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.