టీటీడీ భారీ ఉత్సవం
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం నాడు 71,441 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 23,595 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.87 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మూడు కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లల్లో వేచివున్న భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారం, మంచినీరు, పాలు అందజేశారు.

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం పరేడ్ మైదానంలో సోమవారం రాత్రి కార్తీక మహా దీపోత్సవం, శ్రీ మహాలక్ష్మి పూజ కార్యక్రమం వైభవంగా ముగిసింది. టీటీడీ- హిందూ ధార్మిక పరిషత్ సంయుక్తంగా దీన్ని నిర్వహించాయి.
వేలాదిమంది భక్తులు ఈ ఆధ్యాత్మికోత్సవానికి తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. సామూహిక దీపారాధన చేశారు. కుర్తాళం పీఠాధిపతి సిద్దేశ్వరానంద భారతీ స్వామిజీ భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. వైష్ణవం, శైవం, శాక్తేయం తదితర సర్వ సంప్రదాయాలకు కార్తీకమాసం శ్రేష్టమైనదని, ఈ మాసంలో దైవ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వందల రెట్లు అధికంగా ఫలితం కలుగుతుందని పేర్కొన్నారు.

దీపాన్ని వెలిగించడం ద్వారా మనలోని అజ్ఞానం అనే అంధకారం తొలగిపోతుందని, జ్ఞానం అనే వెలుగు ప్రకాశిస్తుందని స్వామిజీ అన్నారు. పవిత్రమైన కార్తీక మాసంలో టీటీడీ ఆధ్వర్యంలో దీపోత్సవం నిర్వహించడం ఎంతో సంతోషకరమని, శివ కేశవుల వైశిష్ట్యం, దీపం ప్రాముఖ్యత, దీపారాధన వల్ల అజ్ఞానమనే చీకటిని పారద్రోలి ప్రజల హృదయాల్లో ఆధ్యాత్మిక జ్ఞానదీపాలు వెలిగించాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నానని చెప్పారు.
అంతకుముందు- శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ వేద విశ్వవిద్యాలయం వేదపండితులు యతి వందనం, వేదస్వస్తి నిర్వహించారు. అనంతరం దీప ప్రాశస్త్యాన్ని తెలియజేశారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి, శ్రీ చతుర్భుజ మహాలక్ష్మి అమ్మవారికి తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీనివాసర్చన నిర్వహించారు.
ఎస్వీ వేద విశ్వవిద్యాలయం పండితులు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. ఆ తర్వాత అర్చక స్వాములు శ్రీ మహాలక్ష్మి పూజ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రదర్శించిన నృత్య రూపకం భక్తులను ఆద్యంతం ఆకట్టుకుంది.

భక్తులతో దీప మంత్రం మూడు సార్లు పలికిస్తూ సామూహిక లక్ష్మీ నీరాజనం సమర్పించారు. ఈ సందర్బంగా భక్తులందరూ ఒక్కసారిగా చేసిన దీపారాధనతో మైదానం వెలుగుతో నిండిపోయింది. చివరగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవిందనామాలు పాడుతుండగా నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు.
టీటీడీ ఈవో జే శ్యామల రావు, బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి, భాను ప్రకాష్ రెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు, హిందూ ధార్మిక పరిషత్ ప్రత్యేక అధికారి రాజగోపాల్, కార్యదర్శి రఘునాథ్ వేద పండితులు ఇందులో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications