"గుండెల్లో దడ.. మళ్లీ ఇంటికి చేరుతామనుకోలేదు.."
తెనాలి : కశ్మీర్ కల్లోలం తమకు కంటి మీద కునుకు లేకుండా చేసిందంటున్నారు అమరనాథ్ యాత్రకు వెళ్లిన తెలుగువారు. కశ్మీర్ అల్లర్లు బాధాకరం అంటూ.. ఆ భగవంతుడే తమను రక్షించాడని చెబుతున్నారు. ఓవైపు గడ్డకట్టే చలి.. మరోవైపు వెన్నులో వణుకు పుట్టించిన అల్లర్లతో.. బిక్కుబిక్కుమంటూ జమ్మూకు చేరుకున్నామంటున్నారు.
కరెంట్ కట్.. సెల్ ఫోన్లలో ఛార్జింగ్ లేదు.. బయటంతా మంచు.. గుండెల్లో ఒకటే దడ, సురక్షితంగా ఇంటికి చేరుకుంటామా..? లేదా..? అమరనాథ్ యాత్రకు వెళ్లిన తెనాలి మహిళా న్యాయవాదుల అనుభవమిది. తెనాలికి చెందిన కొంతమంది మహిళా న్యాయవాదులు, మరింకొంతమది బంధువులు కలిసి జూన్ 28న అమరనాథ్ యాత్ర కోసం జమ్మూలో అడుగుపెట్టారు.
తొలుత అమృత్సర్ లోని స్వర్ణాలయం, భారత్-పాకిస్తాన్ సరిహద్దును సందర్శించి అనంతరం బెహల్గామ్ కు చేరుకున్నారు తెలుగు యాత్రికులు అక్కడినుంచి హెలికాప్టర్ ద్వారా పంచంతండిని సందర్శించారు. ఆ రాత్రికి అక్కడే చిన్న చిన్న డేరాల్లో బస చేసిన యాత్రికులు మరుసటి రోజు డోలీ ద్వారా కొండపైకి చేరుకున్నారు. డోలీల్లో కూర్చుబెట్టి కొండపైకి మోసుకెళ్లినందుకు గాను ఒక్కొక్కరికి రూ.5200 తీసుకున్నట్టుగా తెలిపారు. కొండపైకి చేరుకోగానే ఉదయం 9.30 గంటల కల్లా భగవంతుడి దర్శనం చేసుకున్నామన్నారు.
ఇక అక్కడినుంచి శ్రీనగర్ బాట పట్టగానే భయంతో వణికిపోయామన్నారు. ప్రతీ మూడేసీ మీటర్లకో సైనికుడు ఉండడం, ఊరి బయట తిరగవద్దని చెప్పడంతో మరింత భయభ్రాంతులకు గురయ్యామన్నారు. ఆ తర్వాతిరోజు కార్గిల్ యుద్ద ప్రాంతాన్ని సందర్శించడానికి వెళుతుండగా.. ఇండియా గో బ్యాక్ అంటూ కశ్మీర్ యువకులు నినాదాలు చేయడాన్ని గమనించామన్నారు.
శ్రీనగర్ లో ఉన్నంతసేపు కొన ఊపిరితో కొట్టుమిట్టాడినంత పనైందని.. జమ్మూ సమీపానికి వచ్చాక గానీ ప్రాణాలు లేచిరాలేదని అక్కడి పరిస్థితుల గురించి వివరించింది యాత్రకు వెళ్లిన తెనాలి బృందం.