లారీని గుద్దిన Kaveri Travels బస్సు- నుజ్జు నుజ్జు
రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తోన్నాయి. గతంలో కర్నూలు వద్ద సంభవించిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 42 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. చేవెళ్ల వద్ద టీజీఎస్ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే వస్తోన్నాయి. సురక్షితంగా గమ్యస్థానం చేరుతామనే గ్యారంటీ ప్రయాణికులకు లేకుండా పోయింది.
ఈ పరిణామాల మధ్య తాజాగా- మరో ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పింది. లారీనీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరికి స్వల్పంగా గాయాలయ్యాయి. అది కూడా కావేరి బస్సే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో ఈ తెల్లవారు జామున ఈ దుర్ఘటన సంభవించింది.

20 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బయలుదేరిన కావేరి ట్రావెల్స్ బస్సు అది. విజయవాడ మీదుగా విశాఖపట్నం చేరుకోవాల్సి ఉంది. రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ బస్సు మార్గమధ్యలో నందిగామ అన్నాసాగరం వద్ద ప్రమాదానికి గురైంది. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేసే సమయంలో ఈ ఘటన జరిగింది.
లారీని వెనుక వైపు నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి బస్సు ఎడమ వైపు భాగం మొత్తం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications