ఇప్పుడు తెల్సిందా: విజయమ్మ, స్పీచ్పై కోర్టుకు కెసిఆర్
హైదరాబాద్/వరంగల్: తెలంగాణ ముసాయిదా బిల్లు లోపభూయిష్టంగా ఉందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పుడు తెలిసిందా? అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సోమవారం ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వంత పాడుతున్నారన్నారు. బిల్లుపై ఓటింగ్ ఏ రూపంలో వచ్చినా తాము పాల్గొంటామన్నారు. రాష్ట్రంలో ఎక్కువ మంది రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు.
తెలంగాణ బిల్లు సభలో పెట్టడమే సరికాదని, ఇప్పుడు దాని పైన చర్చ జరగడం అంటే చంద్రబాబు, కిరణ్ల చేతకానితనమో లేదా నిర్లక్ష్యమో అన్నారు. బిల్లు తప్పులతడకగా ఉన్నప్పుడు గడువు పెంచాలని ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాశారని ప్రశ్నించారు. ఇప్పుడేమే వెనక్కి పంపాలని నోటీసు ఇచ్చారన్నారు. తాము మొదటి నుండి ఓటింగ్, తీర్మానం కోసం పట్టుబడుతున్నామన్నారు. సమైక్యం కోసం ఏ చిన్న అవకాశాన్ని తాము వదులుకోమని చెప్పారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని అందరూ నమ్మారన్నారు. ఆయన ప్రాంతాలకతీతంగా సంక్షేమ పథకాలు అందించారని చెప్పారు. వైయస్ చనిపోయాకే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోను సమైక్యంగానే ఉంటుందని, వైయస్ అనుకున్నది జగన్ నాయకత్వంలో సాధిస్తామన్నారు. రాష్ట్రంలో 32 స్థానాలు గెలుపొంది ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తామన్నారు. పార్టీ పెట్టినప్పటి నుండి తాము ప్రజల మధ్యనే ఉన్నామని చెప్పారు.
వరంగల్ కోర్టుకు హాజరైన కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం ఉదయం వరంగల్ కోర్టుకు హాజరయ్యారు. పరకాల ఉప ఎన్నికల సమయంలో రెచ్చగొట్టే ప్రసంగం చేశారనే కేసు విచారణ నిమిత్తం ఆయన హాజరయ్యారు. న్యాయస్థానం తదుపరి విచారణను జూన్ 9వ తేదీకి వాయిదా వేసింది. 2012 మే 20న ఆత్మకూరు ఎన్నికల సభలో కెసిఆర్ చేసిన ప్రసంగం కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉందంటూ కేసు నమోదయింది.