మూణ్ణెళ్లలో మారుతుందా?: కేసీఆర్, ఎమ్మెల్యేలకి క్లాస్
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ సమస్యకు పదేళ్లపాటు పాలించిన కాంగ్రెసు పార్టీయే కారణమని, పదేళ్లుగా ఉన్న విద్యుత్ సమస్య మూడు నెలల్లో ఎలా మారుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో కేసీఆర్ మాట్లాడారు.
సాధారణ ఎన్నికల్లో తెరాస ఒంటరిగా పోటీ చేసినా ప్రజలు ఆదరించారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం పదవులను తృణపాయంగా వదిలిన పార్టీ తెరాసనే అన్నారు. దీనిని ప్రజలు గుర్తించారని చెప్పారు. ఇప్పటికీ రాష్ట్రంలో అధికారుల కొరత ఉందని చెప్పారు.
వర్క్ టు ఆర్డ్రర్ పైన ఇచ్చిన అధికారులతోనే ఇప్పటికీ ప్రభుత్వం నడుస్తోందన్నారు. తెలంగాణలో విద్యుత్ సమస్యకు కాంగ్రెసు పార్టీయే కారణమన్నారు. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే తెలంగాణకు శాపం అవుతుందన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలన్నారు. ఉద్యమకారులు ఎవరో ప్రజలకు బాగా తెలుసునని చెప్పారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోమని, ఆచితూచి అడుగేస్తామని, ప్రజలకు మంచి జరగాలన్నదే తమ లక్ష్యమన్నారు.
కొన్ని పార్టీల వారు కనీసం జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏపీ ఏర్పడిన పదేళ్లకే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని, అప్పటి నుండి ఉద్యమం ఎన్నోరూపాల్లో జరుగుతోందన్నారు. కొందరు అధికారంలో లేదనే ఉద్దేశ్యంతో అసహనంతో మాట్లాడుతున్నారన్నారు. అధికారం ముఖ్యం కాదని, పదవులు వస్తుంటాయి, పోతుంటాయన్నారు. రుణమాఫీ అమలు చేశామని, హామీలన్నింటిని నెరవేర్చుతామన్నారు.
ఎమ్మెల్యేలకు హైదరాబాదులో పనేమిటని కేసీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు నిత్యం నియోజకవర్గంలోనే ఉండాలని సూచించారు. మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే సంకేతాలు జనాల్లోకి వెళ్తోందని పలువురు నేతలు చెప్పగా.. బీసీలకు ఏం చేస్తామో చూడండి అని కేసీఆర్ అన్నారు.
పలువురు నేతలు ప్రభుత్వ పథకాల పైనే ఎక్కువగా చెప్పారు. దీంతో కేసీఆర్... ప్రభుత్వం గురించి వదిలేసి పార్టీ గురించి చెప్పాలన్నారు. మంత్రులు విధిగా తెరాస భవన్కు రావాల్సిందే అన్నారు. క్యాంప్ ఆఫీసులో త్వరలో ప్రజలకు విజిటింగ్ టైమ్ పెడతామని, ప్రజల వినతులను మంత్రులు, ఎమ్మెల్యేలకు పంపిస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు కలిసేందుకు ప్రత్యేకంగా సమయం ఇస్తానని చెప్పారు.