జగన్ ఓడిపోతున్నట్లేనా.. ? అందుకే.. కేసీఆర్ మౌనంమా ...? టీడీపీ విజయానికి ఇదే సంకేతమంటూ..!
ఏపీ ఎన్నికల్లో విజయం పైన టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారి ధీమాకు కొన్ని కారణాలు చెబుతున్నారు. అయితే, అవి ఆసక్తి కరంగా ఉంటున్నాయి. పోలింగ్ సరళి చూసి తమ విజయం గురించి మాట్లాడటం సహజం. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనంగా ఉంటున్నారని..అదే టీడీపీ విజయానికి సంకేతమంటూ కొత్త విషయం తెర మీదకు తెచ్చారు. ఇప్పుడు ఈ విషయం అటు ఏపీలో..ఇటు తెలంగాణాలోనూ హాట్ టాపిక్గా మారింది.
జగన్కు అంత సీన్ లేదు...
ఆంధ్రాలో జగన్కు అంత సీన్ లేదు అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారని ఏపి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పుకొచ్చారు. ఓ ఉన్నత స్థాయి సమీక్షలో ఈరకంగా కేసీఆర్ వ్యాఖ్యానించారన్నది అయ్యన్న చెబుతున్న మాట. ఇదే సమయంలో ఏపీలో ఎన్నికల తరువాత కేసీఆర్ మౌనంగా ఉంటున్నారని..ఏపిలో టీడీపీ గెలుస్తుందనటానికి ఇదే సంకేతమని చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపిలో జగన్ గెలుస్తున్నారని తన వద్ద సర్వే రిపోర్టులు ఉన్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో చంద్రబాబు ఓడిపోతున్నారని ఆ అసహనంతోనే ఏదేదో మాట్లాడుతున్నారంటూ కేసీఆర్ ఫైర్ అయ్యారు. అయితే, ఎన్నికలు ముగిసిన తరువాత మాత్రం కేసీఆర్ ఏపి ఎన్నికల ఫలితాల గురించి ఎక్కడా మాట్లాడ లేదు. దీని పైన టిడిపి నేతలు విశ్లేషణలు చేస్తున్నారు. జగన్ గెలిచే పరిస్థితి ఉంటే కేసీఆర్ ఖచ్చితంగా మాట్లాడేవారని..టీడీపీ గెలుస్తుంది కాబట్టే, ఆయన మౌనంగా ఉంటున్నారని విశ్లేషిస్తున్నారు.
కేటీఆర్ పైనే అవే అనుమానాలు...
కొద్ది రోజుల క్రితం ట్విట్టర్ ద్వారా కేటీఆర్ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆ సందర్భంలోనూ ఏపి ముఖ్యమంత్రిగా జగన్ సమర్ధవంతంగా పని చేస్తారా అనే ప్రశ్నకు కేటీఆర్ నేరుగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకొనే ప్రయత్నం చేసారు. ఏపీలో పోలింగ్ ముందు వరకూ వైసీపీ గెలుస్తుందంటూ ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్..కేటీఆర్ తాజాగా మౌనం పాటించటం.. తప్పించుకొనే విధంగా వ్యవహరించటం పైనా అనేక రకాలుగా చర్చలు సాగుతున్నాయి. అయితే, వారు మౌనంగా ఉంటే వైసీపీ ఓడిపోతున్నట్టేనా..టీడీపీ గెలుస్తున్నట్లేనా..ఇప్పుడు ఇవే ప్రశ్నలు టీడీపీలో వినిపిస్తున్నాయి. అయితే, వైసిపి నేతలు మాత్రం ఈ రకమైన ప్రచారం పైన మౌనం పాటిస్తున్నారు. తమ విజయం డిసైడ్ అయిపోయిందని..టిడిపి నేతలు అర్దం పర్దం లేని వాదనలతో తమ గెలుపు గురించి కలలు కంటున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ 26న ప్రమాణ స్వీకారం చేయటం ఖాయమని చెబుతున్నారు.
కేసీఆర్..కేటీఆర్ స్పందిస్తారా..
ఆ ఇద్దరి మౌనమే మా గెలుపుకు సంకేతం అంటూ టిడిపి సీనియర్లు చేస్తున్న వాదన పైనా కేసీఆర్ లేదా కేటీఆర్ స్పందిస్తారా అనే చర్చ కూడా మొదలైంది. ఎన్నికల ప్రచార సమయంలోనూ టిడిపి అధినేత చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన అనేక ఆరోపణలు చేసారు. కేసీఆర్ ఏపిలో జగన్ గెలవటం కోసం వెయ్యి కోట్లు డబ్బులు ఇచ్చారని..ఏపిలో జగన్ అధికారంలోకి వస్తే తన మాట నెగ్గించుకోవాలనే ఉద్దేశంతో సహకారం అందిస్తున్నారని ఆరోపించారు. అయితే, కేసీఆర్ మాత్రం ఒకే చోట తాను చెప్పదలచుకున్న సమాధానం చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ లో ఇంటర్ ఫలితాల రాద్దాంతం కొనసాగుతోంది. ఈ సమయంలో రాజకీయాలపైన మాట్లాడితే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందని..సందర్భం చూసి కేసీఆర్ లేదా కేటీఆర్ స్పందిచే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఏపి ఎన్నికల ఫలితాలను వీరిద్దరూ డిసైడ్ చేయలేరని..టిడిపి నేతలు వ్యాఖ్యలు అర్ద రహితమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.