బీహార్ అరాచకవాది వద్దు: కేసీఆర్ను ఏకేసిన రేవంత్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శుక్రవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీహార్ నుండి వచ్చిన కేసీఆర్ తెలంగాణను ఎలా పాలిస్తారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్, తెరాస అరాచక పార్టీ అన్నారు. కేసీఆర్ తెలంగాణలో అరాచక పాలన అందిస్తున్నారన్నారు.
ఆత్మబలిదానాలు చేసుకున్న విద్యార్థులు ఉద్యోగ హక్కుల కోసం పోరాడితే వాళ్లను కాళ్లతో తన్నించారని, రాజకీయ భిక్ష పెట్టిన రైతుల పైన లాఠీఛార్జ్ చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ సొంత నియోజకవర్గంలోని మాసాయిపేటలో పద్దెనిమిది మంది విద్యార్థులు చనిపోతే వెళ్లి పరామర్శించలేదన్నారు. ఆ మాత్రం జాలి చూపించలేకపోయారన్నారు. ఉద్యమంలో పాల్గొన్న దేవీప్రసాద్కు కాకుండా కోట్లకు పడగలెత్తిన కొత్త ప్రభాకర్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చారన్నారు.
పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ చేయించింది బీజేపీ అని, ఆ పార్టీలో కీలక నేత వెంకయ్యనాయుడు అని, అలాగే తెలంగాణ ఇవ్వాలని చంద్రబాబు లేఖ ఇచ్చారని చెప్పారు. బీహార్ నుండి వలస వచ్చిన అరాచకవాది సీఎం అయ్యాడన్నారు. అలాగే గుంటూరులో చదువుకొని వచ్చిన వ్యక్తి మంత్రి అయ్యాడని, ఆంధ్రావారితో కలిసి వ్యాపారం చేస్తున్నాడని ఆరోపించారు. హరీష్ రావు మెదక్ నుండి సిద్దిపేటకు, కొత్త ప్రభాకర్ రెడ్డి నిజామాబాద్ నుండి మెదక్కు వచ్చారన్నారు.
ఉత్తర భారతం నుండి దిగుమతి అయిన కేసీఆర్ తెలంగాణను ఎలా పాలిస్తారన్నారు. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను రూపుమాపింది టీడీపీ అని, అలాంటి టీడీపీ కేవలం ఆంధ్రా పార్టీయా అన్నారు. తెలంగాణ భాష, యాసతో కేసీఆర్కు సంబంధం లేదన్నారు. బీహార్ నుండి వచ్చిన మీరు అధికారం ఎలా అనుభవిస్తారన్నారు. 12వందల మంది విద్యార్థులు చనిపోతే ఆత్మఘోషించలేదా అన్నారు.
కేసీఆర్, తుమ్మల కలయిక చూస్తుంటే కిరాతకులు కౌగిలించుకున్నట్లుగా ఉందన్నారు. ఒకాయనకు మంత్రి పదవి కావాలి, ఇంకొకాయనకు గులాం గిరి కావాలని ఎద్దేవా చేశారు. తమ్మల అంటే మాకు గౌరవం, నమ్మకం ఉండేదన్నారు. కానీ, కేసీఆర్ ఆయన గురించి చెప్పింది విన్నాక తుమ్మలకు వ్యక్తిత్వమే లేదనిపిస్తోందన్నారు. టీడీపీ నుండి పోటీ చేస్తూ.. ఎన్నికల సమయంలో తెరాస గెలుస్తుందని తుమ్మల తనకు చెప్పినట్లుగా కేసీఆర్ అన్నారన్నారు. ఓ పార్టీలో ఉండి అలా ఎలా అంటారన్నారు.
కేసీఆర్ సెంటిమెంట్ కప్పుకొని తెలంగాణలో అరాచక పాలన సాగిస్తున్నాడన్నారు. ప్రజలు తెరాసను గెలిపించినందున.. ఆ పార్టీలోని మరో ఎమ్మెల్యేను ముఖ్యమంత్రిగా చేయాలన్నారు. బీహార్ నుండి వచ్చిన కేసీఆర్ సీఎంగా ఉండవద్దన్నారు. ఆ పార్టీలో మరెవరు సీఎం అయినా ఫరవాలేదని, కేసీఆర్ను తొలగించాలన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్ పైన తిరుగుబాటు చేయాలని సూచించారు.
టీడీపీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే ఎన్టీఆర్ భవన్లో చప్రాసీగా పని చేస్తానని హరీష్ రావు చెప్పారని, అది ఆయన విశ్వసనీయత అని, మహబూబ్ నగర్లో తమ పార్టీ గెలవకుంటే పార్టీని మూసేస్తామని ఈటెల రాజేందర్ చెప్పారని, ఇప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. కేసీఆర్కు తెలంగాణ ప్రజల పైన ప్రేమ లేదని, తెలంగాణవాదం ముసుగులో అధికారంలోకి వచ్చారన్నారు.