కలిశారు: కేసీఆర్ భుజం తట్టిన బాబు, చప్పట్లు కొట్టారు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు కలుసుకున్నారు! ఇరువురు సీఎంలు అయ్యాక పలుమార్లు కలుసుకోవాల్సి ఉన్నప్పటికీ అది సాధ్యం కాలేదు. శనివారం హైదరాబాదుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాక సందర్భంగా వారిరువురు కలుసుకున్నారు. పలకరించుకున్నారు. అనుకున్నది సాధించావంటూ... చంద్రబాబు కేసీఆర్ భుజం తట్టారు.
హైదరాబాద్ వచ్చిన ప్రణబ్ ముఖర్జీకి స్వాగతం పలకడం కోసం బేగంపేట ఎయిర్పోర్టుకు వచ్చి, పరస్పరం పలకరించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగాక రాష్ట్రపతి హైదరాబాద్ రావడం ఇదే ప్రథమం కాగా, కేసీఆర్, చంద్రబాబు ముఖాముఖి కలుసుకోవడం కూడా ఇదే మొదటిసారి. మొక్కుబడిగానో, ముక్తసరిగానో కాకుండా ఇద్దరూ పాత మిత్రుల్లా ఎంతో ఆప్యాయంగా మెదిలారు. కేసీఆర్ ముందే బేగంపేట విమానాశ్రయానికి రాగా, తర్వాత గవర్నర్ నరసింహన్ వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు చేరుకున్నారు.
లాంజ్లోకి ప్రవేశిస్తున్న చంద్రబాబును గమనించి గంభీరంగా నడుం మీద రెండు చేతులూ అన్చి వేచి చూసిన కేసీఆర్, చంద్రబాబు రాగానే నాలుగడుగులు ముందుకు వెళ్లి ఆయనను ఆహ్వానించారు. చేతిలో చేయి కలిపారు. అక్కడే ఉన్న గవర్నర్ ఇద్దరి చేతుల్నీ తన చేతితో కలిపి పట్టుకుని, ఆ దృశ్యానికి మరింత వన్నె తెచ్చారు. ఈ దృశ్యాన్ని చుట్టూ ఉన్నవారు ఉత్కంఠతో కన్నార్పకుండా చూస్తుండిపోయారు. మరికొందరైతే సంతోషాన్ని ఆపుకోలేక గట్టిగా చప్పట్లు కొట్టారు.
అందరూ సంభ్రమాశ్చర్యాల్లో ఉండగానే, ఇద్దరు ముఖ్యమంత్రులూ ముచ్చటలో మునిగారు. మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటూ, ఒకరికొకరు బదులిస్తూ, హాయిగా నవ్వుకుంటూ.. ఒక్కసారిగా పాతరోజుల్లోకి వెళ్లినట్టుగా కనిపించారు. కేసీఆర్ చేతిలో చేయి కలిపి స్వాగతం పలకగా, బాబు రెండుసార్లు కేసీఆర్ భుజం తట్టారు. సరదా సరదా సన్నివేశాలు కొన్ని నిముషాలు సాగాక, ఇద్దరూ కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. అనంతరం కేసీఆర్ చంద్రబాబును వీఐపీల సీటు వద్దకు తీసుకు పోయారు.
ఇద్దరు చంద్రుల మధ్య కూర్చున్న గవర్నర్ వారిద్దరితో మాట కలిపారు. ఏదో విషయంలో ముగ్గురూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. అనంతరం శనివారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుండి ప్రణబ్ తిరుగు ప్రయాణమైనప్పుడు కూడా కేసీఆర్, చంద్రబాబులు బేగంపేట విమానాశ్రయంలో ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. ప్రణబ్ వెళ్లిపోయాక చంద్రబాబు కేసీఆర్తో వెళ్లొస్తానంటూ కరచాలనం చేసి మరీ వెళ్లారు.