ఊహల్లో: కేసీఆర్పై పొన్నం, అక్కడే తిరగబడ్డారు: ఎర్రబెల్లి
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం పైన కాంగ్రెసు, టీడీపీ నేతలు వేర్వేరుగా మండిపడ్డారు. మాజీ ఎంపీ, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సొంత జిల్లాలో లాఠీఛార్జ్ చేయించిన ఘనత కేసీఆర్దే అన్నారు. ఆయన మాటల గారడి కట్టిపెట్టి పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రజలను ఊహల్లోకి తీసుకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇతర పార్టీల నాయకులను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకోవడం తగదన్నారు.
కాంగ్రెస్ హయాంలో అవినీతి జరిగిందని అంటున్న కేసీఆర్ ముందుగా తన ఆస్తులతో పాటు, కుటుంబ సభ్యుల, టీఆర్ఎస్ నేతల ఆస్తులు ప్రకటించాలని పొన్నం డిమాండ్ చేశారు. కరెంట్ అడిగితే రైతుల్ని, ఉద్యోగాలు అడిగితే విద్యార్థులను, హైకోర్టు అడిగితే లాయర్లను కొడుతున్నారన్నారు.
కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మాజీ మంత్రి దానం నాగేందర్ అన్నారు. నగర ప్రజలు విద్యుత్ కోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కేసీఆర్ మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య పైన వ్యక్తిగత విమర్శలు ఏమాత్రం సరికాదన్నారు. కాంగ్రెసు పార్టీకి ప్రజలు ఎప్పుడు మద్దతుగానే నిలుస్తారని చెప్పారు. ఈ నెల 19న సమగ్ర సర్వే సందర్భంగా కూలీలకు ప్రభుత్వమే ఒకరోజు కూలీ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తిరగబడ్డారు: ఎర్రబెల్లి
విద్యుత్ కోతల పైన తెలంగాణ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు వేరుగా ఆరోపించారు. మేనిఫెస్టోలో విద్యుత్ ఇస్తామని నమ్మబలికారని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనన్నారు. రుణమాఫీ పైన కేసీఆర్కు స్పష్టత లేదన్నారు. సొంత జిల్లాలోనే రైతులు ఆయన పైన తిరగబడ్డారన్నారు. వారి పైన లాఠీఛార్జ్ చేయించినందుకు ఆయన సిగ్గుపడాలన్నారు. కేసీఆర్ అసమర్థత వల్లే రాష్ట్రంలో విద్యుత్ కోతలు అన్నారు. సమగ్ర సర్వే ఒక్క రోజులో కాదన్నారు.