కేసీఆర్కు మందు ఎక్కువై మతిపోయింది.. దద్దమ్మవని ఒప్పుకో.. సోము సంచలనం..
కరోనా విలయకాలంలో ఆదాయం అడుగంటిపోయినా, దేశప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతో భారీ ప్యాకేజీని ప్రకటిస్తే.. దానిని ఆహ్వానించాల్సిందిపోయి తెలంగాణ సీఎం కేసీఆర్ అవాకులు చెవాకులు పేలడమేంటని భారతీయ జనతా పార్టీ మండిపడింది. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ.. జగన్ సర్కారుకు వ్యతిరేకంగా సోమవారం భారీ ఆందోళనలు చేపట్టింది. కరెంటు చార్జీల పెంపు, ప్రభుత్వ, దేవాలయ భూముల అమ్మకాలను నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా వేల మంది నాయకులు, కార్యకర్తలు ఇళ్లలోనే నిరసన దీక్షలు చేశారు. నిరసన చేపట్టింది ఏపీలో అయినా.. అక్కడి బీజేపీ నేతల ఫోకస్ ఎక్కువగా కేసీఆర్పై ఉండటం గమనార్హం.

కేసీఆర్కు అవగాన లేదు..
కేసీఆర్ ను టార్గెట్ చేసిన ఏపీ బీజేపీ నేతల్లో ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన కామెంట్లు చేశారు. ‘‘రాష్ట్రాలు ఉత్పత్తి చేసే కరెంటు ఒక యూనిట్ కు 4 రూపాయలు ఖర్చయితే, కేంద్ర సంస్థలు మాత్రం రూ,2.30కే తయారు చేస్తాయి. కేసీఆర్ నోరు తెరిస్తే అందరికీ ఉచిత కరెంట్ ఇస్తానంటాడు. మరి ఆ సబ్సిడీ కింద డిస్కంలకు డబ్బులెవరు చెల్లించాలి? ఓట్ల కోసం మీకు ఉచిత పథకాలు పెట్టుకుంటే ఆ నష్టాన్ని పూడ్చేదెవరు? డిస్కంలను బతికించడానికే కేంద్రం విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది. ఇది అర్థం చేసుకోలేని కేసీఆర్.. మందు ఎక్కువై, మతిపోయిన రీతిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు''అని విమర్శించారు.

ప్రధానిపైనే చిందులా?
ఊళ్లలో రోడ్ల దగ్గర్నుంచి స్కూళ్లలో టాయిలెట్ల దాకా.. రాష్ట్రాల్లో అన్ని పనులు కేంద్రం నిధులతోనే నడుస్తున్నాయని, కరోనా ప్యాకేజీలో భాగంగా రాష్ట్రాలకు పెద్ద ఎత్తున వరాలు ఇచ్చినప్పటికీ కేంద్రానిది గారడీ అని, నిర్బంధాలు విధిస్తోందని కేసీఆర్ వ్యాఖ్యానించడం అవగాహనారాహిత్యమని వీర్రాజు అన్నారు. ‘‘ప్రసంగించడం వచ్చుకదాని ప్రధానిపైనే చిందులేస్తారా? మోదీ సహకరిస్తేనే రాష్ట్రాన్ని నడిపిస్తానని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చెప్పారా? ఇష్టమొచ్చినట్లు సబ్సిడీలు ఇచ్చేమందు కేంద్రాన్ని అడిగారా? అలాగైతే, కేసీఆర్ ఇప్పటికైనా తాను దద్దమ్మనని, బిచ్చగాణ్నని మోదీ ముందు ఒప్పుకోమనండి. ప్రతిదానికి ఒంటికాలిపై కయ్యానికి లేవడంకాదు, కేసీఆర్ ని భాగ్యవంతుడిగా మార్చుతానని మోదీ చెప్పారా?''అని సోము వీర్రాజు విమర్శించారు.
Recommended Video

అన్న వచ్చాడు.. ఆంధ్రాను అమ్మేశాడు..
అధికార పీఠం కోసం వైఎస్ జగన్ ఒక పద్ధతి పాడు లేకుండా ఇష్టారీతిగా వెల్ఫేర్ స్కీములు ప్రకటించాడని, ఇప్పుడా పథకాలను అమలు చేసేందుకే ప్రభుత్వ భూములు, ఆస్తులు అమ్ముతున్నానని చెప్పడం దుర్మార్గమని బీజేపీ నేతలు విమర్శించారు. పెంచిన విద్యుత్ చార్జిల టారిఫ్ లను కూడా వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల కాషాయ నేతలు, కార్యకర్తలు ‘‘అన్న వచ్చాడు.. ఆంధ్రాను అమ్మేశాడు..''అనే ఫ్లకార్డులతో నిరసనలు చేపట్టారు. సవరించిన కరెంట్ స్లాబులను, ప్రభుత్వ భూముల విక్రయాల కోసం తీసుకొచ్చిన జీవోను వెంటన రద్దు చేయాలని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా, ఇతర నేతలు డిమాండ్ చేశారు. ఏపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దియోధర్, ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ఢిల్లీలోనే నిరసనలు చేపట్టారు.












Click it and Unblock the Notifications