టి చిహ్నంపై కెసిఆర్ కసరత్తు, జూన్ 2 వేదికపై డైలమా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఖరారుపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, కాబోయే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కసరత్తు ప్రారంభించారు. జూన్ 2న ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాలని కెసిఆర్ ఇప్పటికే నిర్ణయించారు. ఈ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి ప్రభుత్వం తరఫున ఆదేశాలు, ఉత్తర్వులు జారీ చేయటానికి, ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటానికి రాష్ట్ర చిహ్నం తప్పనిసరి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర చిహ్నం ఖరారు ప్రక్రియను వేగవంతం చేయాలని కెసిఆర్ తమ పార్టీ సీనియర్ నాయకులను ఆదేశించారు. ఇందుకోసం వివిధ రకాల డిజైన్లను రూపొందించే బాధ్యతను ప్రముఖ చిత్రకారులు చంద్ర, తోట వైకుంఠంలకు అప్పగించారు. రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ ఉండేలా చూడాలని గురువారం కెసిఆర్ను కలిసిన సందర్భంలో మజ్లిస్ నేతలు సూచించారు.
అయితే జార్ఖండ్, ఒడిసా, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల చిహ్నాలను పరిశీలించి తగిన సూచనలు చేయాలంటూ పార్టీ సీనియర్ నేతలను కెసిఆర్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నంగా కలశం ఉండగా, తమిళనాడు రాష్ట్ర చిహ్నంగా మీనాక్షి ఆలయ గోపురం ఉంది. ఈ మేరకు మిగిలిన రాష్ట్రాల చిహ్నాలను కూడా పరిశీలించి, కెసిఆర్కు ఒక నివేదిక ఇవ్వటానికి పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. ఇక రాష్ట్ర పక్షి, వృక్షం, జంతువు విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం జరగలేదంటున్నారు.
తెలంగాణకు సంకేతం... కాకతీయుల తోరణం! రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ కూడా ఉండాలని మజ్లిస్ కోరుతోంది. ఈ ఆలోచనకు మెదకు జిల్లా రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎం రంగకృష్ణమాచార్యులు ఇప్పటికే చిత్ర రూపం ఇచ్చారని సమాచారం. కాకతీయ తోరణం, చార్మినార్, అమరవీరుల స్థూపం, తెలంగాణ చిత్రపటం సమ్మిళితంగా దీనిని రూపొందించారు. ఈ చిత్రానికి మా తెలంగాణ కోటానుకోట్ల రతనాల వీణ... మా తెలంగాణ ఆణిముత్యాల సరాల ఠాణా అనే అక్షరమాల వేశారు.
జూన్ 2న కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం ఖాయమైనప్పటికీ, వేదిక విషయంలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎల్బీ స్టేడియంలో నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినప్పటికీ, ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని నిరాడంబరంగా రాజ్భవన్లో నిర్వహిస్తే చాలని కొందరు కెసిఆర్కు సూచిస్తున్నారట.