కేసీఆర్ కు సీఎం జగన్ అరుదైన అవకాశం: ఏపీలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఇలా..!
ఏపీ..తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్..కేసీఆర్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల్లో మరో ఆసక్తి కర పరిణామం చోటు చేసుకోబోతోంది. కేసీఆర్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ అరుదైన అవకాశం కల్పించారు. ఇద్దరి మధ్య ఉన్న సంబంధాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30న కేసీఆర్ ఏపీ పర్యటనకు వస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యేక సందర్భాల్లో మినహా కేసీఆర్ ప్రత్యేకంగా ఏపీకి వచ్చేవారు కాదు. కానీ, జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ గ్యాప్ తొలిగిపోయింది. ఏపీకి కేసీఆర్ తో పాటుగా తెలంగాణ మంత్రులు కూడా వస్తూ పోతూ ఉన్నారు. ఇక..నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లో సమావేశమైన సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈ నెల 30న ఏపీకి ఆహ్వానించారు. ఆయనకు అరుదైన అవకాశం కల్పించారు. దానికి కేసీఆర్ సైతం సరే అన్నారు. దీంతో..ఈ నెల 30న కేసీఆర్.. జగన్ మరో సారి కలవబోతున్నార. అయితే..ఇదే సమయంలో అది వివాదానికి కారణం అవుతుందా అనే చర్చ సైతం మొదలైంది.
30న తిరుమలకు తెలంగాణ సీఎం..
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి దర్శనానికి రావాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్..టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ఆహ్వానించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు హైదరాబాద్ లో సమావేశమైన సమయంలో ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందించారు. దీంతో..బ్రహ్మోత్సవాల విషయాలను అడిగి తెలుసుకున్న కేసీఆర్ తాను హాజరవుతానని స్పష్టం చేసారు. కుటుంబ సభ్యులతో సహా హాజరు కావాలని నిర్ణయంచారు. ఈ నెల 30న ఏపీ ముఖ్యమంత్రి జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. మరిన్ని ప్రారంభోత్సవాలు..శంకుస్థాపనలు చేస్తారు. అదే రోజు కేసీఆర్ సైతం తిరుమలకు రావాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందింది. తిరుమలలో రూ.42.86 కోట్లతో నిర్మించిన మాతృశ్రీ వకులాదేవి అతిథిగృహాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారు. పీఎసీ-5కి సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తాం. భక్తుల వసతి కోసం రూ.79 కోట్లతో నిర్మిస్తున్న వీటిని ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రారంభిస్తారు.
శ్రీవారికి ఇద్దరు సీఎంల పట్టు వస్త్రాలు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సాధారణంగా ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారు శ్రీవారికి పట్టు వస్త్రాల సమయం లో పట్టు వస్త్రాలు ఇవ్వటం ఆనవాయితీ. అయితే, ముఖ్యమంత్రి జగన్ తనతో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రికి ఈ అవకాశంలో భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తిరుమల తిరుపది దేవస్థానం బోర్డులో సభ్యుల నియామకంలో కేసీఆర్ సిఫార్సు చేసిన వ్యక్తులకు జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. కేసీఆర్ సైతం దైవ భక్తుడు కావటంతో ఏపీ ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని వెంటనే ఆమోదించారు. అయితే, అక్కడ గతంలో ఉన్న ఆనవాయితీ మేరకే ముందుగా ఏపీ ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆ తరువాత తెలంగాణ ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తారు. అదే విధంగా.. తిరుమలలో జరిగే ఉత్సవాలను ఇద్దరు ముఖ్యమంత్రులు తిలకిస్తారు. అక్కడే ఇద్దరూ సమావేశం కానున్నారు. రాజకీయ అంశాలు మాత్రం చర్చకు రావని చెబుతున్నారు.
కేసీఆర్ చిరకాల కోరిక..ఇప్పుడు జగన్ ద్వారా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీవారి భక్తుడు. ఆయన బ్రహ్మోత్సవాల్లో ఎప్పుడూ పొల్గొన లేదు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా..కేంద్ర మంత్రిగా.. శాసనసభా డిప్యూటీ స్పీకర్ గా ఉన్న సమయంలో ఇటువంటి అవకాశం రాలేదు. ఇక రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మాత్రం బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల అవసరాల మేరకు బస్సుల ఏర్పాటు పైన సమీక్ష కు పరిమితమయ్యారు. ఇక, ఇప్పుడు స్వయంగా ఏపీ సీఎం..టీటీడీ చైర్మన్ స్వయంగా వచ్చి ఆహ్వానించటంతో కేసీఆర్ బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి తో పాటుగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించే అరుదైన అవకాశం కేసీఆర్ సద్వినియోగం చేసుకోనున్నారని చెబుతున్నారు. అయితే, ఇదే జరిగితే రాజకీయంగా ఈ అంశాన్ని సైతం వివాదాస్పదం చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో.. ఇప్పటికే నిర్ణయించిన విధంగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ నెల 30న బ్రహ్మోత్సవాలకు హాజరవుతారా..లేక మార్పు జరుగుతుందా అనేది చూడాలి.