రెండు స్థానాల్లో కెసిఆర్ పోటీ, ఓస్థానం టిఎన్జీవో నేతకు..?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సార్వత్రిక ఎన్నికల్లో రెండుచోట్ల నుంచి బరిలోకి దిగనున్నారా!? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఒక లోకసభ నియోజకవర్గంతో పాటు అసెంబ్లీకి పోటీ చేయనున్నారట. ఎన్నికల తర్వాత కేంద్ర, రాష్ట్రాల్లో అప్పటి రాజకీయ పరిణామాలను బట్టి ఒకదానికి రాజీనామా చేసి, మరొక స్థానంలో కొనసాగాలని భావిస్తున్నారంటున్నారు.
రాజీనామా చేసిన స్థానం నుంచి టిఎన్జీవో అధ్యక్షులు దేవీ ప్రసాదరావును బరిలోకి దింపే అవకాశముందట. మెదక్ జిల్లా చిన్నకోడూర్ మండలం అల్లీపూర్కు చెందిన దేవీ ప్రసాద్కు వచ్చే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ లోకసభ లేదా మెదక్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని టిఎన్జీవో నేతలు కెసిఆర్ను కోరారు. ఈ మేరకు టిఎన్జీవో జిల్లా కార్యవర్గంతో పాటు జిల్లాలోని అన్ని యూనిట్లు గతంలోనే ఏకగ్రీవంగా తీర్మానించాయి.

దాంతో, రెండు స్థానాలకు పోటీ చేస్తున్న తాను గెలిచిన తర్వాత ఏదో ఒక స్థానానికి రాజీనామా చేస్తానని, రాజీనామా చేసినచోట ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని దేవీ ప్రసాదరావుకు కెసిఆర్ సూచించారట. ఇదే విషయమై టిఎన్జీవో జిల్లా నేతలకు కూడా హమీ ఇచ్చారట. ఈ నేపథ్యంలోనే, సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ లోకసభ లేదా గజ్వేల్ అసెంబ్లీ స్థానాలకు కెసిఆర్ పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది.
రెండుస్థానాల్లోనూ విజయం సాధిస్తే అప్పటి పరిస్థితులను బట్టి ఏదో ఒక స్థానానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి మెజారిటీ లభిస్తే కెసిఆర్ అసెంబ్లీ సభ్యత్వాన్నే కొనసాగించుకుని, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని, ఒకవేళ పరిస్థితులు తారుమారైతే లోకసభ సభ్యుడిగా కొనసాగి, అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తారట. దాంతో ఖాళీ అయ్యే స్థానానికి తెరాస అభ్యర్థిగా దేవీ ప్రసాదరావుకు టికెట్ ఇవ్వనున్నారట.












Click it and Unblock the Notifications