క్లారిటీ వచ్చింది: అనుభవాలు చెప్పిన కేసీఆర్, ఇస్తాం: ఏపీపై దత్తాత్రేయ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పది నెలల పాలన అనుభవాలను మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులతో పంచుకున్నారు. గురువారం కేసీఆర్ రాష్ట్ర మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులతో సమావేశమయ్యారు.
గురువారం సచివాలయంలో జరిగిన భేటీలో ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాల అమలు తీరుపై చర్చించారు. అలాగే నామినేటెడ్ పదవుల భర్తీ, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను ఆయన సమీక్షించారు. ఇక త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికలపై కేసీఆర్ చర్చించారు. ఎన్నికల వ్యూహంపై సమాలోచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పది నెలల పాలనపై తన అనుభవాలను వివరించారు. ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు నియోజకవర్గాల పైన దృష్టి సారించాలన్నారు. మరికొన్ని కొత్త పథకాల గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పారు.
పార్లమెంటరీ కార్యదర్శుల జీతభత్యాలు, నిధులకు సంబంధించిన జీవోలు ఒకటి రెండు రోజుల్లో వస్తుందన్నారు. వచ్చే రెండేళ్లలో కరెంట్ కోతలు లేకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. దేవాదుల - కంతనపల్లి ప్రాజెక్టులను వేగవంతం చేయాలన్నారు. మొన్నటి ఏరియల్ సర్వేతో కొంత క్లారిటీ వచ్చిందన్నారు.
కేంద్ర నిధులతోనే ఏపీ అభివృద్ధి: బండారు దత్తాత్రేయ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దశల వారీగా కేంద్రం నిధులు ఇస్తుందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ చిత్తూరు జిల్లాలో అన్నారు. కేంద్ర నిధులతోనే ఏపీ అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు.
అన్ని శాఖల్లోను ఉద్యోగాలు మెండుగా ఉన్నాయని, యువత నైపుణ్యంతో అందిపుచ్చుకోవాలన్నారు. ఎనిమిది నెలల పాలనలో చిన్న విమర్శ లేకుండా భారతీయ జనతా పార్టీ పాలన సాగిందన్నారు. డిజిటల్, స్కిల్, మేకిన్ ఇండియా పైన కేంద్రం ముందుకు పోతోందన్నారు.