తప్పుచేస్తే శిక్ష: ఓల్డ్సిటీ అల్లర్లపై కెసిఆర్, బాబు విచారం
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు పాతబస్తీలోని సిఖ్చావ్నీ అల్లర్ల పైన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం స్పందించారు. జంట నగరాల ప్రజలు అందరూ సామరస్యాన్ని, సంయమనాన్ని పాటించాలని కోరారు. తప్పు చేసిన వారిని చట్టం శిక్షిస్తుందన్నారు.
తెలంగాణ ప్రజలది గంగా, జమున, తహజీబ్గా ప్రసిద్ధి చెందినదని, జంట నగరాల బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకుందామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలం సంయమనం పాటించి, కలిసిమెలిసి జీవించాలని కోరారు. అందరం సమన్వయంతో ముందుకు వెళ్దామన్నారు. పాతబస్తీ ఘటనపై టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.
ప్రజలు వదంతులు నమ్మవద్దని గవర్నర్ నరసింహన్ కోరారు. పాతబస్తీ ఘటన పైన గవర్నర్ సమీక్ష నిర్వహించారు. సిఎస్, డిజిపిల నుండి పరిస్థితులు తెలుసుకున్నారు.

కాగా, రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అవాంఛనీయమైన సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాదులోని రాజేంద్రనగర్ ప్రాంతంలో బుధవారంనాడు ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ విషయాన్ని డిజిపి ప్రసాదరావుతో పాటు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్, హైదరాబాదు పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ధ్రువీకరించారు.
ఘర్షణలు పోలీసు కాల్పులకు దారి తీసినట్లు తెలుస్తోంది. పోలీసు కాల్పుల్లో ముగ్గురు మరణించినట్లు ఆ పోలీసు అధికారులు చెప్పారు. రాజేందగ్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో నిరవధిక కర్ఫ్యూ విధించారు. కిషన్ బాగ్ పరిసర ప్రాంతాలకు ప్రజలు రావద్దని సివి ఆనంద్ సూచించారు.
రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయని, వాటిని అదుపు చేసే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారని ప్రసాదరావు చెప్పారు. రాజేంద్ర నగర్ ప్రాంతంలో పరిస్థితి అదుపులో ఉందని పోలీసు అధికారులు చెప్పారు. ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని వారు కోరారు. అల్లర్లను అదుపు చేసే క్రమంలో ఇద్దరు పోలీసులకు గాయాలైనట్లు కూడా తెలిపారు. అల్లర్లకు కారణమైనవారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications