సీఎం దిష్టిబొమ్మ దగ్ధం, లాఠీఛార్జ్: స్పందించిన కేసీఆర్
హైదరాబాద్/మెదక్: మెదక్ జిల్లాలో రైతుల పైన జరిగిన లాఠీఛార్జ్ అంశం పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మధ్యాహ్నం స్పందించారు. రైతులకు ఇబ్బంది లేకుండా ఆరు గంటలు విద్యుత్ సరఫరా చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. పరిశ్రమలకు కోత విధించి అయినా సాగుకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు.
బాధాకరం: పోచారం
రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం బాధాకరమని రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. ఈ విషయంలో పోలీసులు సంయమనం పాటించాలని సూచించారు.
కాగా, విద్యుత్ కోతలను నిరసిస్తూ మెదక్ జిల్లా చేగుంట మండలం నార్సింగి గ్రామంలో రైతులు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. కనీసం ఆరేడు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయడం లేదంటూ అన్నదాతలు రాస్తారోకో చేశారు. నార్సింగిలో సబ్ స్టేషన్ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. విద్యుత్ ఇవ్వడం లేదని నిరసిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు.
ఈ సమయంలో రైతులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో కోపోద్రిక్తులైన రైతులు తిరగబడ్డారు. పోలీసుల పైన రాళ్లు రువ్వారు. దీంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. రైతుల నిరసనతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. మరోవైపు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో రైతులు విద్యుత్ సబ్ స్టేషన్లను ముట్టడించారు.