ఎమ్మెల్యేలకు కేసీఆర్ గిఫ్ట్, నియోజకవర్గాల్లో క్యాంప్ ఆఫీస్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శాసన సభ్యులకు తీపి వార్త అందించారు! ఎమ్మెల్యేలకు నియోజకవర్గ కేంద్రంలో క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారని సమాచారం. ఇందుకోసం ఒక్కో కార్యాలయానికి రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చు కానున్నాయని అంచనాకు వచ్చారని తెలుస్తోంది.
ఆయా నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేలకు క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా కేసీఆర్ వారికి నజరానా ఇస్తున్నారు. ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఎవరు ఉంటే వారు నియోజకవర్గంలోని ఆ క్యాంప్ కార్యాలయంలో ఉంటారు.

అధికారులతో నియోజకవర్గం పైన సమీక్షలు జరిపేందుకు, చర్చించేందుకు, నియోజకవర్గ సమస్యలను అవగాహన చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుందని భావించినందు వల్లే కేసీఆర్ ఈ నిర్ణయానికి వచ్చారు. నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీసులు ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వారంలోగా స్థల సేకరణ చేయాలని ఆదేశించారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పలు ఆసక్తికరమైన, సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్రమ భూములపై కొరడా ఝులిపించడం, ఏపీతో ఫీజు రీయింబర్సుమెంట్స్, జలం, విద్యుత్ తదితర సమస్యల పైన ధీటుగా స్పందించారు. సింగరేణిని కేంద్రం గుప్పిట నుండి రాష్ట్రం గుప్పిట్లోకి తీసుకోవాలని భావిస్తున్నారు. తాజాగా, హైదరాబాదులో సీఎంకు క్యాంప్ కార్యాలయం ఉన్నట్లుగా.. నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు క్యాంప్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.












Click it and Unblock the Notifications