కేసీఆర్ దూకుడు: టీ సరిహద్దులు, సర్వే ఆఫ్ ఇండియా..
సీఎంతో సోమవారం పలువురు ప్రముఖులు భేటీ అయ్యారు. ఇందులో భాగంగా సర్వే ఆఫ్ ఇండియా, రిమోట్ సెన్సింగ్ అధికారులు కలిశారు. ఈ సందర్భంగా... సరిహద్దులతో సహా అన్ని రకాల భూములను సర్వే చేయాలని కేసీఆర్ అధికారులను కోరారు. అత్యాధునిక పరికరాలతో తెలంగాణవ్యాప్తంగా సర్వే జరిపించాలన్నారు. సీఎంను నేవీ అధికారులు కూడా కలిశారు.
సింగరేణిలో కేంద్రం వాటా కొనేందుకు...
ఇప్పటికే సింగరేణి ఉద్యోగులకు, కార్మికులకు ఇంక్రిమెంట్ ఇస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. సింగరేణి అధికారులతో సోమవారం భేటీ అయిన కేసీఆర్.. సింగరేణి కార్మికులకు తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్, సకల జనుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా ప్రకటిస్తామన్నారు.
సింగరేణి పరిధిలోని కరీంనగర్, అదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ నిర్మిస్తామన్నారు. అంతేకాదు, సింగరేణిలో కేంద్రంకు ఉన్న వాటాను కొనుక్కొని స్టేట్ కంపెనీగా చేసుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు. విదేశాల్లో మైనింగ్ యాక్టివేషన్ను ప్రారంభించిన పదిమంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆస్ట్రేలియా, మొజాంబిక్, ఇథియోపియా దేశాలలో ఈ కమిటీ పర్యటిస్తుందన్నారు.
రామగుండం ఎన్టీపీసీకి 1500 ఎకరాలు, జెన్కోకు 424 ఎకరాలు, మణుగూరుకు రెండువేల ఎకరాలు కేటాయించాలని నిర్ణయించామన్నారు. 2015 నాటికి నవంబర్ 15లోగా 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, అందుకోసం రెండు సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు. గనుల తవ్వకాల పైన అధ్యయనం చేయాలన్నారు.
సింగూరు ప్రాజెక్టుపై హరీష్ రావు సమీక్ష
తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు సోమవారం సింగూరు ప్రాజెక్టును సందర్శించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రబీ సీజన్లో సింగూరు ద్వారా 20వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. జిల్లాల్లోని అన్ని ప్రాజెక్టుల పూడికతీతపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. మండలానికి ఒక నీటిపారుదల శాఖ ఏఈ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని, ఎవరు ఆందోళన చెందవద్దన్నారు.