రాజంతో విభేదాలు: వార్తాపత్రిక పెడుతున్న కెసిఆర్
హైదరాబాద్: నమస్తే తెలంగాణ అధినేత లక్ష్మీరాజంతో విభేదాలు పొడసూపిన నేపథ్యంలో పార్టీ తరఫున ఓ దినపత్రికను తేవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం తరఫున ఓ మ్యాగజైన్ను తేవడానికి కూడా ఆయన ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు.
నమస్తే తెలంగాణ అధిపతి లక్ష్మీరాజం బిజెపిలో చేరడంతో పార్టీ తరఫున సొంతంగా దినపత్రికను ప్రారంభించడానికి కెసిఆర్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రచారం చేయడానికి ప్రభుత్వం తరఫున ఓ మ్యాగజైన్ తేవాలని కెసిఆర్ ప్రయత్నిస్తు్నారు.
ప్రభుత్వం తరఫున తెచ్చే మ్యాగజైన్ విషయంపై ఇప్పటికే ఆయన ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారితో, సమాచార శాఖ కమిషనర్ చంద్రవదన్తో చర్చించినట్లు చెబుతున్నారు. తెలంగాణ పేరుతో పలు మ్యాగజైన్లు ఉండడంతో ప్రభుత్వ పత్రిక పేరు ప్రత్యేకంగా, విశిష్టంగా ఉండాలని కెసిఆర్ సూచించినట్లు చెబుతున్నారు. ఈ మ్యాగజైన్ జూలైలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రభుత్వ తరఫున వెలువడే మ్యాగజైన్ పేరు కోటిరత్నాల వీణ తెలంగాణ కావచ్చునని అంటున్నారు. తెరాస తరఫున ప్రచురించే దినపత్రికకు బంగారు తెలంగాణ పేరు ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది.