ఏడ్చాను: కెసిఆర్, అమరులకు మండలి సంతాపం
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు, యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, వారి త్యాగ ఫలమే తెలంగాణ రాష్ట్రమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఆయన శనివారం శాసనమండలిలో తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. 1969 నుంచి జరిగిన తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ఉద్యమకారులు తమ ప్రాణాలను త్యాగం చేశారని అన్నారు.
1956లోనే ఆంధ్రా ప్రాంతంలో తెలంగాణను విలీనం చేయొద్దని ఉద్యమం జరిగిందని చెప్పారు. ఇడ్లీ, సాంబార్ గో బ్యాక్ అనే పేరుతో అప్పుడే ఉద్యమించారని గుర్తు చేశారు. దివంగత ఫ్రొఫెసర్ జయశంకర్ విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారని చెప్పారు. 1969 ఉద్యమ నేపథ్యంలో హైదరాబాద్లో తెలంగాణపై జరుగుతున్న సమావేశంలో పాల్గొనేందుకు వరంగల్ నుంచి జయశంకర్ బయల్దేరారని, అయితే ఆయన ప్రయాణించే బస్సు భువనగిరిలో ఫెయిల్ అవడంతో సమావేశంలో పాల్గొనడం ఆలస్యమైందన్నారు.
ఆయన పాల్గొనే సమాశంపై పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారని, అక్కడే ఉండి ఉంటే తాను కూడా తెలంగాణ కోసం మరణించే వాడ్నని, ఈ యాభై ఏళ్ల తెలంగాణ బాధలను చూసేవాడ్ని కాదని జయశంకర్ తనతో చెప్పారని కెసిఆర్ తెలిపారు. సమావేశానికి ముందు రోజు జరిగిన కాల్పుల్లో మరో ముగ్గురు తెలంగాణ ఉద్యమకారులు మృతి చెందారని కెసిఆర్ గుర్తు చేశారు.
1969 ఉద్యమంలో 369మంది చనిపోగా, మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1200మంది చనిపోయారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల వారు పాల్గొన్నారని అన్నారు. మలిదశ ఉద్యమాన్ని శ్రీకాంత్ చారి తన ఆత్మబలిదానంతో ప్రారంభించాడని అన్నారు. శ్రీకాంత్ చారి పెట్రోల్ పోసుకుని కాలిపోతూ అమ్మా అని అరవ లేదని.. జై తెలంగాణ అని అరిచాడని కెసిఆర్ చెప్పారు.
ఆస్పత్రిలో ఉన్న శ్రీకాంత్ చారిని చూసేందుకు తాను వెళ్లానని.. తనను ఆస్పత్రిలోకి పోనీయలేదని అన్నారు. అప్పుడు తనకు చాలా బాధ కలిగిందని, ఏడ్చేశానని తెలిపారు. తమ పార్టీకి చెందిన నాయిని నర్సింహారెడ్డి, ఇతర పార్టీ నేతలను అక్కడికి పంపించానని చెప్పారు. ఆంధ్రా మీడియా కథనాలు దారుణంగా ప్రసారం చేశాయని అన్నారు. వాటి వల్ల చాలా మంది యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. ప్రస్తుతం అమరుల త్యాగాలు వృథా కాలేదని, తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. అమరులను స్మరించుకోవవడం మన విధి అని తెలిపారు.
అమరుల త్యాగాలను స్మరిస్తూ తీర్మానం చేస్తున్నామని అన్నారు. సభలో 2 నిమిషాలపాటు మౌనం పాటించారు. అమరులను స్మరిస్తూ తీర్మానం పెట్టినందుకు కాంగ్రెస్ పక్ష నేత డి శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. స్వయం పాలన కోసం విద్యార్థులు, యువకులు ముందుండి పోరాటం చేశారని అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి సమష్టిగా ముందుకెళ్లాలని సూచించారు. అమరుల త్యాగాల వల్లే తెలంగాణ వచ్చిందని మరో సభ్యుడు వెంకటేశ్వర్లు అన్నారు.