కేసీఆర్ అంచనాలు నిజమయ్యేనా - కొత్త వ్యూహం..!!
ఏపీ, తెలంగాణలో ఎన్నికల ఫలితాల పై ఉత్కంఠ కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికల్లో తాము ఆరు సీట్లు గెలుస్తామని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సరళి పైన పార్టీ ముఖ్య నేతలతో కేటీఆర్ సమీక్ష చేసారు. అదే సమయంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పైన బీఆర్ఎస్ అధినేత తన అంచనాలు వెల్లడించారు. రాజకీయంగా ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న కేసీఆర్...ఇప్పుడు ఏపీలో ఫలితాల పైన ఆసక్తితో కనిపిస్తున్నారు.
తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరిగింది. తాము గెలిచే స్థానాల పైన గులాబీ పార్టీ నేతలు కొత్త లెక్కలతో సిద్దమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ తిన్న బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లో తిరిగి సత్తా చాటాలని ప్రయత్నం చేసింది. పోలింగ్ పూర్తయిన తరువాత పార్టీ ముఖ్య నేతలు సరళి పైన సమీక్షించారు. ఆ సమయంలోనూ గెలిచే సీట్ల సంఖ్య పైన ధీమా వ్యక్తం చేసారు. అటు బీజేపీ - కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ జరిగిందని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. తాము మెజార్టీ స్థానాలు గెలుస్తామని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ఏపీ ఎన్నికల ఫలితాల పైన స్పందించారు. ఏపీలో జగన్ గెలుస్తారనే సమాచారం తమకు ఉందన్నారు. పోలింగ్ పూర్తయిన తరువాత కేటీఆర్ మరోసారి ఇదే అభిప్రాయం వ్యక్తం చేసారు. ఏపీలో 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ ప్రభుత్వంతో సఖ్యతగా వ్యవహరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కేసీఆర్ రాజకీయంగా విభేదించారు. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య మరింత గ్యాప్ పెరిగింది. ఇప్పుడు అటు కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా కూటమి, బీజేపీ నాయత్వంలోని ఎన్డీఏతో దూరంగా ఉంటున్నారు. దీంతో..ఏపీలో జగన్ గెలిస్తే రాజకీయంగా కొంత మేర మద్దతు ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. మరి..కేసీఆర్ అంచనాలు నిజమవుతాయా లేదా అనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications