బాబు లత్కోర్ పనులు, జగన్ను పట్టించుకోం: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లత్కోరు పనులు చేస్తున్నాడని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యాఖ్యానించారు. తెలంగాణకు వ్యతిరేకంగా గోలగోల చేస్తున్నాడని ఆయన చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పార్టీ కార్యవర్గ సమావేశానంతరం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. శాసనసభకు బిల్లు, తీర్మానం రాబోవని, సమాచారం మాత్రమే వస్తుందని కెసిఆర్ చెప్పారు. హైదరాబాదులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఏం చేస్తున్నాడనేది తాము పట్టించుకోమని ఆయన అన్నారు.
చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బ్యాలెన్స్ తప్పి మాట్లాడి తిరిగి వచ్చాడని, జాతీయ మీడియాకు సమాధానం చెప్పలేక బ్యాలెన్స్ తప్పాడని ఆయన అన్నారు. చంద్రబాబు చెప్పే సమన్యాయం ఏమిటని ఆయన అడిగారు. తెలంగాణను అడ్డుకోవాలనే ప్రయత్నం కాకపోతే విభజన ఎలా చేయాలో చెప్పవచ్చు కదా అని ఆయన అన్నారు. డిమాండ్ చెప్పకుండా దీక్ష చేశారని ఆయన చంద్రబాబుపై విమర్శ చేశారు. ఇంకా చంద్రబాబుతో ఉంటూ తెలంగాణ టిడిపి నాయకులు తెలంగాణ ప్రజలను మోసగించవద్దని ఆయన సూచించారు.
తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లుగా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన చంద్రబాబు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్య గురించి మాట్లాడుతూ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై అవాంఛనీయ వ్యాఖ్యలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టే ప్రశ్నే లేదని, తాను కాపలా కుక్కలా ఉంటానని చెప్పిన దానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు.
హైదరాబాదుపై సర్వాధికారాలు తెలంగాణ రాష్ట్రానికే ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేశవరావు నేతృత్వంలోని పార్టీ బృందం జివోఎంకు నివేదిక సమర్పిస్తుందని ఆయన చెప్పారు. హైదరాబాదుపై ఎటువంటి ఆంక్షలు పెట్టినా అది తెలంగాణను అవమానించడమేనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాని మన్మోహన్ సింగ్కు, కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కెకె నేతృత్వంలోని బృందం విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
13 ఏళ్ల నుంచి తెలంగాణ ప్రజలు కొట్లాడుతున్నారని, వారు ప్రజలు కారా అని ఆయన అన్నారు. ఆనాడు రెండు రాష్ట్రాలను కలిపారని, ఇప్పుడు విడదీశారని, దాని వల్ల నష్టమేమిటని ఆయన అన్నారు. తెలంగాణలో ఉన్న సీమాంధ్ర వాళ్లు గ్రామాల్లో హాయిగా ఉన్నారని, ఎన్నికల్లో కూడా పోటీ చేసి గెలుస్తున్నారని, తమకు ఏ విధమైన ఇబ్బంది లేదని వారు చెబుతున్నారని ఆయన అన్నారు.
విభజన ఆగదని తెలిసి కూడా సీమాంధ్ర నాయకులు అక్కడి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. ఏదైనా మాట్లాడితే హేతుబద్దంగా ఉండాలని ఆయన అన్నారు. విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, తిరుపతి వంటి నగరాలు సీమాంధ్రకు చాలా ఉన్నాయని, తెలంగాణకు తక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. ప్రాజెక్టులు నగరాలకే ఇస్తే వాటికి ఇవ్వవచ్చునని ఆయన అన్నారు. చేసుకోవాలంటే అభివృద్ధి పెద్ద సమస్య కాదని ఆయన అన్నారు.
తెలంగాణలో వరద తాకిడి ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. వరద తాకిడి ప్రాంతాలకు వైద్యులతో పాటు సహాయం అందించడానికి ఐదు బృందాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పాకిస్తాన్ కాల్పుల్లో మరమించిన సైనికుడు ఫిరోజ్ ఖాన్కు నివాళులు అర్పించినట్లు చెప్పారు.
హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్పై అఘాయిత్యాన్ని కెసిఆర్ ఖండించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడాలని, అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.