అది మామూలే!: రాహుల్పై కేసీఆర్, 44 శాతం ఫిట్మెంట్ ఎందుకంటే
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన పైన తనదైన శైలిలో బుధవారం స్పందించారు. తెలంగాణ రాష్ట్రానికి చాలామంది గాంధీలు వస్తుంటారు.. పోతుంటారని, వారి గురించి ఏం మాట్లాడతామని అన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం గురించి మాట్లాడిన సందర్భంగా రాహుల్ పర్యటన గురించి స్పందించాలని మీడియా కోరింది. దీనిపై ఆయన పైవిధంగా స్పందించారు. రాహుల్ పర్యటన ప్రభావం తెలంగాణలో ఏమాత్రం ఉండదని చెప్పారు.
కాగా, తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు.. వారు డిమాండ్ చేసిన దానికన్నా ఒక శాతం అధికంగా ఇస్తూ 44 శాతం ఫిట్మెంట్ను తెలంగాణ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం నాడు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రకటించారు.
కార్మిక సంఘాలతో చర్చలు సలఫలమైన అనంతరం సచివాలయంలో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇతర ఉద్యోగులతో పోల్చి చూస్తే ఆర్టీసీ కార్మికులకు అతి తక్కువగా జీతాలున్నాయని, ఆర్టీసీని కాపాడాలనే ఉద్దేశంతో కార్మికులకు 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమన్నారు.
పెంచిన వేతనాలు జూన్ నుంచి ఇస్తామన్నారు. యాభై శాతం బకాయిలను దసరాకు చెల్లిస్తామని మిగతా బకాయిలను ఉగాది, వచ్చే దసరాకు చెల్లిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అదేవిధంగా కార్మికుల సమ్మె కాలానికి జీతాలిస్తామన్నారు.
కార్మికులపై పెట్టిన కేసులు, సస్పెన్షన్లను ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చారు. ఆర్టీసీలో కాంట్రాక్ట్ కార్మికులను గురువారం నుంచి రెగ్యులరైజ్ చేస్తామన్నారు. రిటైర్డ్ కార్మికులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీని పెంటకుప్పలా మార్చి తెలంగాణకు ఇచ్చారని మండిపడ్డారు. ఆర్టీసీని అప్పుల ఊబిలో నుంచి బయటపడేసేందుకు బడ్జెట్లో ప్రత్యేక గ్రాంట్లు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.తెలంగాణ ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉందని, ప్రస్తుతం ఆర్టీసీ దాదాపు 1900 కోట్ల అప్పుల్లో ఉందన్నారు.
ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు కార్మికులు కృషి చేయాలన్నారు. చాలా దేశాల్లో అర్బన్ ట్రాన్స్పోర్టును స్థానిక సంస్థలకు అప్పగించారని పేర్కొన్నారు. ఆర్టీసీని అప్పుల ఊబి నుంచి గట్టెక్కించేందుకు ఈ నెలాఖరులో కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం కాబట్టి 44 శాతం ఫిట్మెంట్ ఇస్తున్నామని చెప్పారు. కాగా, ఏపీ 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
గవర్నర్ను కలిసిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు గవర్నర్ నరసింహన్తో బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. స్వచ్ఛ హైదరాబాదు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.