రాష్ట్రపతి హామీ: కెసిఆర్, ఇవ్వరని నమ్మకం: సుజనా
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగ బద్దంగా జరుగుతుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హామీ ఇచ్చారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పారు. కోదండరామ్ తదితర జెఎసి నాయకులతో, తమ పార్టీ నేతలతో కలిసి కెసిఆర్ గురువారం సాయంత్రం రాష్ట్రపతిని కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకాలు ఎదురు కాకుండా చూడాలని తాము రాష్ట్రపతిని కోరామని, సానుభూతితో పరిశీలిస్తామని రాష్ట్రపతి చెప్పారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చొరవ చూపినందుకు తాము ధన్యవాదాలు తెలిపినట్లు ఆయన చెప్పారు. తెలంగాణ కల సాకారమవుతుందని కెసిఆర్ అన్నారు.
ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యులు రాష్ట్రపతిని కలిశారు. ఆ తర్వాత సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి అనుమతి ఇవ్వరనే నమ్మకం తమకు ఉందని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని తాము ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలపారు.
బిల్లు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తుందనే విషయాన్ని కాంగ్రెసు పెద్దలు చెబుతున్నారని, ఇది సరైంది కాదని చెప్పినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన నుంచి మీరే కాపాడాలని కోరామని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన బిల్లు విషయంలో సమాఖ్య స్ఫూర్తిని నిర్లక్ష్యం చేస్తున్నారని రాష్ట్రపతికి వివరించినట్లు ఆయన తెలిపారు.
పదేళ్లుగా పరిష్కారం కాని సమస్యను పది రోజుల్లో పరిష్కారం చేయడం తగదనే అభిప్రాయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకుని వెళ్లినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ, సీమాంధ్ర అనేది సమస్య కాదని విభజన విషయంలో వ్యవరిస్తన్న తీరే అభ్యంతకరమని చెప్పామని ఆయన అన్నారు. మీడియా సమావేశం తర్వాత సీమాంధ్ర తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు జై సమైక్యాంధ్ర నినాదాలు చేశారు.